నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది చివరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆ రాష్ట్రంలో సమగ్ర ఓటర్ జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టి…ఇటీవల సవరించిన ఓటర్ ముసాయిదాను ఈసీ విడుదల చేసింది. ఆ ముసాయిదాపై ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు మండిపడుతున్నాయి.ఈ వ్యవహారంపై వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలని 18 రోజులుగా విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీదా వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్ష ఎంపీలు విమర్శిస్తున్నారు. బీహార్ లో ఓట్ల చోరీ ఏవిధంగా జరుగుతున్నదో…ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వీడియో రూపంలో సవివరంగా చెప్పారు.

బీహార్ ఎస్ఐఆర్ అంశంపై మోడీ ప్రభుత్వంలో చలనంలేకపోవడంతో..‘ఓటు చోరీ’ ఆందోళనను కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది.ఈనెల 17న ‘ఓట్ అఽధికార్’ పేరిట ఇండియా కూటమి పార్టీలు నిరసన ప్రదర్శన జరపనున్నాయి. కాగా, ‘ఓటు చోరీ’పై పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన, ఉద్యమ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది. ఖర్గే, రాహుల్గాంధీ నేతృత్వంలో జరిగిన ఏఐసీసీ ముఖ్యుల భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఆందోళనా యాత్ర’, ఈ నెల 22 నుంచి సెప్టెంబరు 7వరకు ప్రతి రాష్ట్ర రాజధానిలో ‘ఓటు దొంగలారా.. గద్దె దిగండి’ పేరిట ప్రదర్శనలు, సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 వరకు సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు.
