Friday, June 20, 2025
E-PAPER
Homeజాతీయంయుద్ధంతో భారత్‌కు కష్టకాలం

యుద్ధంతో భారత్‌కు కష్టకాలం

- Advertisement -

– చాబహార్‌ పోర్టులో రూ.4,771 కోట్ల పెట్టుబడులు
– అమెరికా ఆక్రమిస్తే కష్టమే!
న్యూఢిల్లీ:
ఇజ్రాయిల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం భారతదేశానికి కష్టాలు తెస్తుంది. రెండు దేశాలు ఆస్పత్రులు, జనవాసాలపైకి దాడులు చేసుకుంటున్నాయి. సామాన్య ప్రజానీకం అశువులు బాస్తున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌కు తెరవెనుక మద్దతు ఇస్తున్న అమెరికా, ఇప్పుడే నేరుగానే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో భారత్‌కు చెందిన రూ.4,771 కోట్లకు నష్టకాలం వచ్చింది. వ్యూహాత్మక పెట్టుబడులు, ప్రయోజనాల్లో భాగంగా ఆ దేశంలోని చాబహార్‌ పోర్టులో ఇండియా పోర్ట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ (ఐపీజీఎల్‌) ద్వారా దాదాపు రూ.4,771 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పోర్టు భారతదేశానికి పాకిస్తాన్‌ను దాటవేసి ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియాకు వ్యూహాత్మక మార్గాన్ని అందిస్తుంది.ఇరాన్‌-ఇజ్రాయిల్‌ వివాదంలో ఆమెరికా జోక్యం పెరుగుతుండటంతో చాబహార్‌ పోర్టుపై ఆంక్షలు పెరుగుతున్నాయి.
పదేండ్ల ఒప్పందం
మే 2024 నాటికి చాబహార్‌లోని షాహిద్‌ బెహెష్టి టెర్మినల్‌ను పదేండ్లు నిర్వహించేలా ఇండియా పోర్ట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ (ఐపీజీఎల్‌)కు ఒప్పందం ఉంది. అయితే ఈ పోర్టును నిర్వహించేందుకు 2017లో అదానీ గ్రూప్‌, ఎస్సార్‌ వంటి ప్రయివేట్‌ కంపెనీలు ఆసక్తి చూపించాయి. త్వరలో ఈ పోర్టును అదానీ గ్రూపునకు అప్పగించాలనే యోచనలో మోడీ ప్రభుత్వం ఉంది. ఈ పోర్టు ద్వారా భారతదేశానికి ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియా, యూరప్‌తో ఓడరేవు ద్వారా వాణిజ్యం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. అలాగే ఉక్కు దిగుమతులను సులభతరం చేసేందుకు చాబహార్‌-జహెడాన్‌ రైల్వే లైన్‌లో 85 85 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని భారతదేశం కలిగిఉంది. 2026 నాటికి ఈ రైల్వేలైన్‌ అందుబాటులోకి రానుంది. ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం తీవ్రమై, అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే తొలుత చాబహార్‌ పోర్టునే ఆక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల భారతదేశ పెట్టుబడులను అడ్డుపెట్టుకొని అమెరికా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే భారతదేశానికి ఈ వ్యూహాత్మక పెట్టుబడులన్నీ బూడిదలో పోసినట్టే అవుతాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -