నవతెలంగాణ-హైదరాబాద్: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుందని ఆర్బిఐ గురువారం ప్రకటించింది. ద్రవ్యోల్బణ అంచనాలు, జిడిపి వృద్ధిలో నియంత్రణ, ద్రవ్యవిధానం ముందుకు సాగేందుకు మద్దతునిస్తున్నాయని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ దాని స్థిరమైన స్థూల ఆర్థిక మూలాలు, బలమైన ఆర్థికరంగం, స్థిరమైన వృద్ధిని సాధించడంతో 2025-26లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. ప్రపంచ మార్కెట్లో అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్యం విచ్ఛిన్నం, సరఫరా గొలుసులో అంతరాయాలు మరియు వాతావరణ అనిశ్చితులు ద్రవ్యోల్బణం, వృద్ధిరేటుకు ప్రతికూలతను కలిగించే కారకాలుగా ఆర్బిఐ గుర్తించింది.
అయితే సరఫరా గొలుసుపై ఒత్తిళ్లను తగ్గించడం, ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు తగ్గించడం ముందస్తు నైరుతి రుతుపవనాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తి పెరగడం వంటి అంశాలు ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగేందుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. భారత్ సంతకాలు చేసి చర్చలు జరుపుతున్న వాణిజ్య ఒప్పందాల ప్రభావం పరిమితంగా ఉండేలా చూసుకోవడానికి తోడ్పడతాయని, సేవల ఎగుమతులు, అంతర్గత చెల్లింపులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతాల లోటును భర్తీ చేయవచ్చని సూచించింది. వరుసగా రెండు సమీక్షలలో కీలక పాలసీ రేట్లను తగ్గించిన ఆర్బిఐ 12నెలల కాలంలో ద్రవ్యోల్బణం 4శాతం లక్ష్యానికి చేరుకునేందుకు అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే .. ముఖ్యంగా నికర వడ్డీ మార్జిన్లలో నియంత్రణ దృష్ట్యా బ్యాంకులు ట్రేడింగ్, బ్యాంకింగ్ బుక్ రిస్క్లను పరిష్కరించుకోవాలని ఆర్బిఐ సిఫారసు చేసింది.