నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్లో భారత్ అధిక సంఖ్యలోనే యుద్ధ విమానాలను నష్టపోయిందని సైన్యం నిర్థారించింది. అయితే నాలుగు రోజుల ఘర్షణలు అణుయుద్ధానికి దారితీయలేదని పేర్కొంది. ”ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయి..ఎన్ని జెట్లను నష్టపోయాం .. ఇక్కడ నెంబర్లు ముఖ్యం కాదు, అవి ఎందుకు కూలిపోయాయి, అక్కడ ఏం తప్పులు జరిగాయి అన్నది ముఖ్యం” అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. శనివారం ఆయన సింగపూర్లో జరిగిన షాంగ్రి-లా సదస్సులో పాల్గన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదనను తోసిపుచ్చారు. పాకిస్తాన్ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. అయితే భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. వ్యూహాత్మక తప్పులను అర్థం చేసుకున్నారని, పరిష్కరించుకున్నారని, నిర్దేశిత లక్ష్యాల వైపు ప్రయోగించారని అన్నారు.
మే 7న పాకిస్తాన్పై దాడుల సమయంలో భారత యుద్ధ విమానాలపై కేంద్ర ప్రభుత్వం లేదా సైనికాధికారుల మొదటి ప్రత్యక్ష వ్యాఖ్యలు ఇవి. భారత్-పాక్ల మధ్య అణుయుద్ధాన్ని నివారించేందుకు అమెరికా సాయం చేసిందన్న ట్రంప్ వాదనపై వ్యాఖ్యానించేందుకు అనిల్ చౌహాన్ నిరాకరించారు. కానీ ఇరువైపులా అణ్వాయుధాలను వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న వాదన వాస్తవం కాదని అన్నారు.