నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్ లోని న్యూజెర్సీ ఎయిర్పోర్టులో భారతీయ విద్యార్థిపై పోలీసులు అమానుషంగా వ్యవహరించిన తీరుపై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించింది. అమెరికా చట్టబద్ధమైన ప్రయాణికులను స్వాగతించడం కొనసాగిస్తున్నప్పటికీ, అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, అమెరికా చట్టాలను ఉల్లంఘించడాన్ని సహించబోమని, అలాంటి వారికి అమెరికా సందర్శించే హక్కు లేదని యూఎస్ ఎంబసీ పేర్కొంది. “యునైటెడ్ స్టేట్స్ మా దేశానికి చట్టబద్ధమైన ప్రయాణికులను స్వాగతిస్తూనే ఉంది. అయితే, చట్టవిరుద్ధమైన వారికి యునైటెడ్ స్టేట్స్ను సందర్శించే హక్కు లేదు. అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, యుఎస్ చట్ట ఉల్లంఘనను మేము సహించము” అని మంగళవారం ఎక్స్లో రాసుకొచ్చింది.
కాగా, న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థిని భద్రతాధికారులు నేలపై పడేసి.. చేతులను వెనక్కి పెట్టి సంకెళ్లు వేశారు. సుమారు నలుగురు అధికారులు అతనిని గట్టిపట్టుకోగా, వారిలో ఇద్దరు అధికారులు అతని వీపుపై మోకాళ్లను ఉంచి నొక్కి పెట్టారు.ఈ అమానుష ఘటనపై సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటపై భారత్ తోపాటు అంతర్జాతీయంగా యూఎస్ తీరుపై విమర్శలు వెలువెత్తున్నాయి.