నవతెలంగాణ – హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు టర్కీ బాహాటంగా మద్దతు పలకడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఇందులో భాగంగా, టర్కిష్ ఎయిర్లైన్స్తో కుదుర్చుకున్న విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా రద్దు చేసుకోవాలని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడేది లేదని ఈ చర్య ద్వారా కేంద్రం మరోసారి గట్టి సంకేతాలు పంపినట్లయింది.
ఇండిగో సంస్థ టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి రెండు బోయింగ్ 777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతోంది. ఈ లీజు ఒప్పందం మే 31తో ముగియాల్సి ఉండగా, మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ఇండిగో పౌర విమానయాన మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. అయితే, ఈ అభ్యర్థనను మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ప్రయాణికులకు తక్షణమే ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, ఇండిగో విజ్ఞప్తి మేరకు కేవలం మూడు నెలల పాటు, అంటే 2025 ఆగస్టు 31 వరకు మాత్రమే గడువు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పొడిగించేది లేదని తేల్చి చెప్పింది.
“ఇండిగో సంస్థ ఈ డంప్ లీజు విమానాల ఒప్పందాన్ని పొడిగించిన మూడు నెలల కాలంలోగా, అంటే 2025 ఆగస్టు 31 లోపు, టర్కిష్ ఎయిర్లైన్స్తో రద్దు చేసుకుంటుందని హామీ ఇచ్చిన మీదట, ఇదే చివరి అవకాశంగా ఈ పొడిగింపు మంజూరు చేయబడింది. ఈ కార్యకలాపాల కోసం ఇకపై ఎలాంటి పొడిగింపు కోరరాదు” అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.