నవతెలంగాణ హైదరాబాద్: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజైన సోమవారం కూడా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై సహా దేశ వ్యాప్తంగా 400లకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇక ఈ సంక్షోభం వేళ ఇండిగో షేర్లు భారీగా పడిపోయాయి.
ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేర్ ధర నేడు పడిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం పతనమైంది. ఆ తర్వాత కొద్దిగా కోలుకొంది. ఉదయం 10 గంటల సమయంలో షేర్లు రూ.5,160 వద్ద, 3.92 శాతం (రూ.210.50) నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ల విలువ 9 శాతానికి పైగా విలువ కోల్పోయిన విషయం తెలిసిందే.



