నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ మంటలు ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్న దేశాలు తాజాగా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారంనాడు ప్రకటించాయి. తక్షణం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ‘స్పీడ్’, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ‘పవర్’, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ‘XP95’ పెట్రోల్ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ2.35 వరకూ పెరిగాయి. అయితే ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. మెరుగైన ఇంజన్ పనితీరు, మైలేజ్ కోసం వాహనాల్లో ప్రీమియం పెట్రోల్ వాడుతుంటారు.
ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీగా పెంచింది. ఇండస్ట్రియల్ డీజిల్ ధరను 25 శాతం పెంచింది. దీంతో లీటర్ ధర రూ.22 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ.87.57 నుంచి 109.59కి ఇది పెరిగింది. ఇండస్ట్రియల్ డీజిల్ను విద్యుత్ అంతరాయాల సమయంలో జనరేటర్లపై నడిచే కర్మాగారాలు, ఫాపింగ్ మాల్స్, బుల్డోజర్లు, భారీ యంత్రాల్లో వాడుతుంటారు. వీటి ధరలు పెరగడం వల్ల కంపెనీల ఖర్చు పెరిగి వినియోగదారునిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.



