నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గోవులను, దూడలను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో దళిత వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కొందరు వ్యక్తులు దాడి చేసి, వారికి అరగుండు చేయించి, బలవంతంగా మురుగునీరు తాగించారు. ఈ అమానుష సంఘటన గంజాం జిల్లాలో కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… గంజాం జిల్లా ధారాకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం నాడు హరిపూర్ గ్రామంలో ఒక వ్యక్తి వద్ద నుంచి ఒక ఆవు, రెండు దూడలను కొనుగోలు చేశారు. వాటిని నడుపుకుంటూ తమ స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఖారిగుమ్మ అనే ప్రాంతానికి చేరుకోగానే, సుమారు ఏడెనిమిది మంది వ్యక్తులు వారిని అడ్డగించారు. పశువులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అలాగే బాధితుల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించారు. బాధితులు దీనిని ప్రతిఘటించడంతో నిందితులు వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
అంతటితో ఆగకుండా ఆ దుండగులు బాధితులిద్దరికీ అరగుండు గీయించారు. అనంతరం వారిని ఖారిగుమ్మ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జహాడ గ్రామం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ, బలవంతంగా వారిద్దరిచేత మురుగు కాలువలోని నీటిని తాగించారు. వీధుల్లో మోకాళ్లపై నడిపించి తీవ్రంగా అవమానించారు.
ఈ దారుణం నుంచి బాధితులిద్దరూ ఎలాగోలా తప్పించుకుని తమ గ్రామానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి తలలు, వీపులపై గాయాలు ఉండటంతో పోలీసులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ధారాకోట పోలీస్ స్టేషన్ అధికారి చంద్రికా స్వయిన్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.