– మూలిగే నక్కపై తాటిపండులా జీఎస్టీ మోత
– స్వల్ప కారణాలతో క్లయిమ్ల తిరస్కరణ
– ప్రజల్లో తగ్గిపోతున్న విశ్వాసం
న్యూఢిల్లీ: ఒకప్పుడు ఆరోగ్య బీమాను జీవితానికి భరోసాగా భావించేవారు. అయితే ఇప్పుడది మోయలేని భారంగా మారుతోంది. జీతం కంటే ప్రీమియం అధికంగా ఉంటోందని పాలసీదారులు వాపోతున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా అసలు ప్రీమియమే అధికంగా ఉంటోందని చెబుతుంటే దానిపై ఏకంగా 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఇది పాలసీదారులపై…ముఖ్యంగా సీనియర్లపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోంది.
పునరాలోచనలో ప్రజానీకం
గత మూడు సంవత్సరాల కాలంలో పాలసీదారులు దాఖలు చేసిన ఆరోగ్య బీమా క్లయిములలో సుమారు యాభై శాతం వరకూ తిరస్కరణకు గురికావడమో, పాక్షికంగా ఆమోదం పొందడమో, పరిష్కారానికి సుదీర్ఘ కాలం పట్టడమో జరిగింది. దేశంలోని 327 జిల్లాలలో లక్ష మందికి పైగా పాలసీదారుల అభిప్రాయాలను సేకరించిన లోకల్ సర్కిల్స్ సర్వే ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పరిణామాలతో విసిగి వేసారిపోతున్న ప్రజలు పాలసీలు తీసుకునే విషయంపై పునరాలోచనలో పడుతున్నారు. కొందరు ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీల కొనసాగింపును నిలిపివేశారు. ప్రజల మనోభావాలలో స్పష్టమైన మార్పు కన్పిస్తోందని పెట్టుబడి సలహాదారు, సహజ్ మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ చెప్పారు. ‘చాలా మంది క్లయింట్లు నా వద్దకు వచ్చి సలహా అడుగుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా గురించి ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ప్రీమియంలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. మేము పాలసీలు తీసుకోవాలని సలహా ఇస్తున్నప్పటికీ కొందరు కవరేజీని తగ్గించుకుంటున్నారు. మరికొందరు వాటి జోలికే వెళ్లడం లేదు’ అని తెలిపారు.
పెరుగుతున్న తిరస్కరణలు
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.21,861 కోట్ల విలువ కలిగిన క్లయిములు తిరస్కరణకు గురికాగా 2023-24లో ఆ మొత్తం రూ.26,037 కోట్లకు పెరిగింది. బీమా నియంత్రణ-అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) అందించిన డేటా ప్రకారం 2022-23లో కంటే 2023-24లో తిరస్కరణకు గురైన ఆరోగ్య బీమా క్లయిముల విలువ 19 శాతం పెరిగింది. నిరాకరించిన క్లయిములు 11 శాతం ఉండగా 6 శాతం పెండింగులో ఉన్నాయి. క్లయిములను గంట లోగా పరిష్కరించాలని ఆస్పత్రులు, బీమా సంస్థలను ఐఆర్డీఏఐ కోరుతున్నప్పటికీ నగదు రహిత క్లయిముల పరిష్కారానికి 6 నుండి 48 గంటల సమయం పడుతోంది. కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే తమ క్లయిములు సకాలంలో పరిష్కారమయ్యాయని తెలిపారు. పాలసీల తిరస్కరణకు అనేక కారణాలు ఉన్నాయని కుమార్ వివరించారు.
నాటి ధీమా నేడేది?
‘మీ తల పైకెత్తి జీవించండి’…ఈ పాత జీవిత బీమా ప్రకటన ట్యాగ్లైన్ గుర్తుందా? జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ బీమా పాలసీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందనే సందేశాన్ని ఇది అందించింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వైద్య ఖర్చులు, ప్రమాదాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో బీమా అనేది ఇక ఎంతమాత్రం ఐచ్ఛికం కాబోదు. ఇక్కడ మనకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న ఏమంటే ప్రజలు తాము చెల్లిస్తున్న బీమా మొత్తానికి తగినంత రక్షణ పొందుతున్నారా అనేది. ఆస్పత్రులలో క్లెయిములు పేరుకుపోతున్నాయి. పాలసీదారుల ప్రీమియంలు వారి జీతాల కంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. క్లెయిముల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటన్నింటినీ చూస్తూ ప్రజలు బీమా పథకాల పైనే పునరాలోచనలో పడుతున్నారు.
గుదిబండలా జీఎస్టీ
ఆరోగ్య, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీని విధించడంతో చాలా మంది బీమా సదుపాయాన్ని వదులుకుంటున్నారు. జీఎస్టీ రేటు కారణంగా పాలసీ ఖర్చు బాగా పెరుగు తోంది. వృద్ధుల ఆరోగ్య బీమాకు సంబంధించి ఈ పన్ను భారం మరింత దారుణంగా ఉంది. ప్రీమి యంలు ఇప్పటికే అధికంగా ఉండగా జీఎస్టీ కూడా తోడై మోయలేని భారం గా మారుతోంది. ప్రజలు తమ ప్రీమి యంలో సుమారు 20 శాతాన్ని జీఎస్టీగా చెల్లిస్తున్నారు. దీనిని మినహాయిస్తే వారు కవరేజీని పెంచుకునే అవకాశం ఉంటుంది. లేదా ఇతరత్రా ఖర్చులకు ఆ మొత్తాన్ని వాడుకోవచ్చు. బలమైన ప్రజారోగ్య వ్యవస్థ లేనప్పుడు బీమాపై జీఎస్టీ అనేది గుదిబండలా మారుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి జీవులు దీనితో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య, టర్మ్ ఇన్సూరెన్స్ను…కనీసం అత్యవసర, తక్కువ విలువ కలిగిన పాలసీలను… జీఎస్టీ నుండి మినహాయించాలన్న డిమాండ్ పెరుగుతోంది. కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు జీఎస్టీ, వ్యాట్ నుండి ఆరోగ్య బీమాను మిన హాయించాయి. జీఎస్టీ రేటును పూర్తిగా మినహాయించక పోయిన ప్పటికీ కనీసం ఐదు శాతానికి తగ్గిస్తే పాలసీ దారులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
క్లయిముల పైనే ఫిర్యాదులు
ఐఆర్డీఏఐకి వస్తున్న ఫిర్యాదులలో ఎక్కువ భాగం క్లయిములకు సంబంధించినవే. ఒక్క 2022-23లోనే ఐఆర్డీఏఐకి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవియన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐజీఎంఎస్) ద్వారా రెండు లక్షల ఫిర్యాదులు వచ్చాయి. 2021-22లో జీవిత బీమా విభాగంలో 15,088 క్లయిములు తిరస్కరణకు గురయ్యాయి. వీటి విలువ రూ.1,026 కోట్లు. చిన్న చిన్న కారణాలతోనే క్లయిములను తిరస్కరిస్తున్నారు. ఏదేమైనా బీమాపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోతోందన్నది సుస్పష్టం.