నవతెలంగాణ-హైదరాబాద్: వ్యాక్సిన్ల అంతరం భారత్లో ఆందోళనకర పరిస్థితికి దారితీయనుంది. వ్యాక్సిన్ల అంతరంతో భారత్ క్లిష్టమైన ప్రపంచ సవాళ్లలో ముందంజలో ఉండనుందని నివేదిక తెలిపింది. 2023లో 1.44 మిలియన్లు (14,50,000మంది) చిన్నారులకు వ్యాక్సిన్లు వేయలేదని నివేదిక తేల్చింది. వీరిని జీరో డోస్లో చేర్చినట్లు లాన్సెట్ ప్రచురించిన విశ్లేషణ ‘ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ వ్యాక్సిన్ కవరేజ్ కొలాబరేటర్స్’ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రోగనిరోధకత యత్నాల్లో తీవ్రమైన స్తబ్దత నెలకొందని, ముఖ్యంగా భారత్, ఇతర దక్షిణాసియా దేశాలలో లక్షలాది మంది చిన్నారులు ప్రాణాంతకమైన, నివారించగల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
1980 -2023 మధ్య వ్యాక్సిన్లను పరిమితిని విస్తరించడంలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ., 2010 నుండి ఈ వేగం గణనీయంగా తగ్గిందని అధ్యయనం కనుగొంది. 2023 నాటికి, ప్రపంచవ్యాప్తంగా కోటి 50 లక్షలకు పైగా (15.7మిలియన్ల ) మంది చిన్నారులు తమ జీవితంలో మొదటి సంవత్సరంలో (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) డిటిపి వ్యాక్సిన్ మోతాదులను తీసుకోలేదని అంచనా. దీనిలో భారత్ వాటా గణనీయంగా ఉంది. 2010-2019 మధ్య 204 దేశాలలో 100 దేశాలలో మీజిల్స్ (తట్టు) వ్యాక్సిన్ కవరేజీ తగ్గింది. అయితే 36 అధిక ఆదాయ దేశాల్లో 21 దేశాలు డిటిపి, మీజిల్స్, పోలియో, క్షయ వ్యాధులకు కనీసం ఒక్క వ్యాక్సిన్ డోస్ల కవరేజ్లో క్షీణతను ఎదుర్కొన్నాయి. కోటి 50 లక్షల టీకాలు వేయని పిల్లల్లో సగానికి పైగా చిన్నారులు కేవలం ఎనిమిది దేశాల్లో నివసిస్తున్నారు. భారత్లో 14 లక్షల జీరో డోస్ పిల్లలు నైజీరియా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యధికంగా ఉన్నారు. ఈ చిన్నారుల్లో దక్షిణాసియా ప్రాంతం 13శాతం మందిని కలిగి ఉంది. ఇది దక్షిణాసియాలో సంక్షోభం తీవ్రతను నివేదిక హైలెట్ చేస్తోంది.
అయితే ఇప్పటికే ఉన్న సవాళ్లను కొవిడ్ మహమ్మారి తీవ్రతరం చేసిందని నివేదిక తేల్చింది. 2020 నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కవరేజ్ రేట్లు గణనీయంగా తగ్గాయని, 2020-2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 15.6 మిలియన్ల మంది పిల్లలు డిటిపి వ్యాక్సిన్, మీజిల్స్ పూర్తి మూడు మోతాదులను తీసుకోలేకపోయారని అధ్యయనం అంచనా వేసింది.