– విమాన ప్రమాద దుర్ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ
– మూడు నెలల్లో నివేదిక
– విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది
– మృతదేహాలను వీలైనంత తొందరగా అందజేస్తాం: కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు. అవసరమైతే ఈ కమిటీలో మరికొంత మందిని చేరుస్తామని ప్రకటించారు. డీఎన్ఏ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయనీ, మృతదేహాలను వీలైనంత తొందరగా అందజేస్తామని తెలిపారు. ఎయిర్సేఫ్టీపై శనివారం నాడిక్కడ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగిందని అన్నారు. ఎయిర్పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలో 650 అడుగుల ఎత్తులో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో పైలట్ మేడే కాల్ చేశారని అన్నారు. విమాన సిబ్బందిని ఏటీసీ సంప్రదించినా స్పందన రాలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ సంయుక్తంగా స్పందించాయని తెలిపారు. అదే విధంగా ఘటనా స్థలంలో వెంటనే మంటలను ఆర్పి మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బ్లాక్బాక్స్ దొరికిందని తెలిపారు. దీన్ని డీకోడ్ చేసిన తరువాత మరింత సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై హౌం శాఖ సెక్రెటరీ అధ్యక్షతన హైలెవల్ కమిటీతో దర్యాప్తు చేయిస్తున్నామని అన్నారు. ప్రత్యేక అధికారులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఈ కమిటీలో ఉన్నారని చెప్పారు. హౌంశాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ సెక్రెటరీ, గుజరాత్ అధికారులు, పోలీసు కమిషనర్ అహ్మదాబాద్, స్పెషల్ డైరెక్టర్ ఐబీని ఈ కమిటీలో నియమించినట్టు చెప్పారు. నిపుణుల దర్యాప్తు పూర్తయిన వెంటనే మీడియాకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. మూడు నెలల్లో ప్రమాదంపై కమిటీ నివేదిక అందజేస్తుందని భావిస్తున్నామని అన్నారు. మెడికల్, ఫోరెన్సిక్, టీమ్లతో పాటు ఐదుగురితో ఏఐబీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే బోయింగ్ 787 సిరీస్ విమానాల భద్రతపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ప్రస్తుతం 34 బోయింగ్-787 విమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఏడు విమానాల భద్రతపై సమీక్ష జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఈ సిరీస్ను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.
”ఈ విమాన ప్రమాదం నన్ను ఎంతో షాక్కు గురిచేసింది. రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. రెండు రోజులుగా బాధలో ఉన్నాను” అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదమని పేర్కొన్నారు. హై లెవెల్ కమిటీతో సోమవారం (జూన్ 16) భేటీ అవనున్నట్టు తెలిపారు. గడిచిన 48 గంటల నుంచి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు
- Advertisement -
- Advertisement -