Wednesday, April 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఐపీఎస్ అధికారి సంజయ్‌కు షరతులతో బెయిల్ మంజూరు

ఐపీఎస్ అధికారి సంజయ్‌కు షరతులతో బెయిల్ మంజూరు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణల కేసులో జైలులో ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

బెయిల్ కోసం రూ. 50 వేల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు, మూడు రోజుల్లోగా తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, ప్రతి శుక్రవారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని స్పష్టమైన షరతులు విధించింది.

అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలో సంజయ్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అగ్ని-ఎన్‌వోసీ వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని, పనులు పూర్తికాకముందే రూ. 59 లక్షలకు పైగా చెల్లింపులు చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ఆగస్టు 26న ఏసీబీ కోర్టులో లొంగిపోగా, అప్పటి నుంచి విజయవాడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న కొండలరావుకు (ఏ4) కూడా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -