నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆశ్చర్యకరమైన రీతిలో క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సంచలన ప్రకటన చేసింది.ఈ దాడిలో అత్యంత శక్తివంతమైన ‘ఖైబర్’ మిస్సైళ్లను వినియోగించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. నెతన్యాహు కార్యాలయంతో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ హెడ్క్వార్టర్స్ను కూడా తాము టార్గెట్ చేశామని, ఈ దాడి తర్వాత నెతన్యాహు పరిస్థితి ఏంటన్నది తెలియదని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ ప్రకటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. తమ ప్రకటనలో ఇజ్రాయెల్ ప్రధానిని ‘క్రిమినల్’గా అభివర్ణిస్తూ, జియోనిస్ట్ పాలన అంతమే తమ లక్ష్యమని ఇరాన్ ఆర్మీ స్పష్టం చేసింది.
గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రగిలిపోతున్న ఇరాన్, దీనికి ప్రతీకారంగానే తాము ఈ విధ్వంసకర దాడులకు దిగుతున్నట్లు ప్రకటించింది.



