– స్పష్టం చేసిన ఖోమైనీ
– జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం తప్పదంటూ అమెరికాకు హెచ్చరిక
టెల్ అవీవ్, టెహరాన్ : ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖోమేని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్-ఇరాన్ ఘర్షణల్లో ఒకవేళ అమెరికా జోక్యం చేసుకుంటే ‘కోలుకోలేని నష్టం’ తప్పదని హెచ్చరించారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల హెచ్చరికలు, హత్య బెదిరింపుల నేపథ్యంలో ఖోమేని బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. తన రహస్య స్థావరం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని టీవీలో చదివి వినిపించారు.
ఇక యుద్ధం మొదలైంది
ఎక్కడ దాక్కున్నా బేషరతుగా లొంగిపోవాలంటూ ఖోమేనిని ట్రంప్ హెచ్చరించారు. ఖోమేని ఎక్కడున్నా అమెరికాకు తెలిసిపోతుందని, అయితే ఇప్పటికీ ఆయనను చంపే ఆలోచన లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఖోమేనీ స్పందిస్తూ ఒక పోస్టు పెట్టారు. ‘యుద్ధం మొదలైంది’ అని వ్యాఖ్యానించారు. ఖడ్గం పట్టుకొని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫొటోను ఈ పోస్టుకు జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్టుగా ఆ చిత్రంలో ఉంది.
హైపర్సోనిక్ క్షిపణులతో దాడి చేశాం
ఇజ్రాయిల్పై బుధవారం తెల్లవారుజామున హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించినట్టు ఇరాన్ తెలిపింది. ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్-3లో భాగంగా హైపర్ సోనిక్ ఫతా -1 క్షిపణులను ప్రయోగించామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక ప్రకటనలో తెలిపింది. హైపర్ సోనిక్ క్షిపణులు ధ్వని వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించగలవు. వీటిని ట్రాక్ చేయడం, అడ్డు కోవడం కష్టతరం.
ఆయుధాల ఫ్యాక్టరీలపై ఇజ్రాయిల్ దాడులు
ఇరాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్, అమెరికాలు బెదిరింపులకు దిగుతున్న సంగతి తెలిసిందే.
అంతకు ముందు ఇరాన్ రాజధాని టెహరాన్ లక్ష్యంగా ఇజ్రాయిల్ యుద్ధ విమానాలతో దాడి జరిపింది. టెహరాన్లోని ఆయుధాల తయారీ కేంద్రం, సెంట్రిఫ్యూజ్లను తయారు చేసే ఫ్యాక్టరీపై దాడి చేసినట్టు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. రక్షణ కావాలంటే ప్రజలు తక్షణమే రాజధాని నగరాన్ని వీడాలని ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు చేసింది.
అమెరికాకు రష్యా హెచ్చరిక
ఇజ్రాయిల్కు నేరుగా సైనికసాయం చేయొద్దుంటూ రష్యా బుధవారం అమెరికాను హెచ్చరించింది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత క్షీణిస్తాయని పేర్కొంది. ఈ మేరకు రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గి రిబకొవ్ చేసిన వ్యాఖ్యలను రష్యా మీడియా వెల్లడించింది.
హోర్ముజ్పై ఇరాన్ నియంత్రణ
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణకు ఇరాన్ మాజీ ఆర్థిక మంత్రి ఇషాన్ ఖండూజి పిలుపునిచ్చారు. ఇరాన్ అనుమతితోనే ట్యాంకర్లు, ఎల్ఎన్జి కార్గోలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తాయని ప్రకటించారు. ఈ విధానం గురువారం నుంచి వందరోజుల పాటు అమలు చేయాలన్నారు. తక్షణమే ఈ విధానాన్ని అమలు చేస్తేనే ఫలితం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
మానవత్వంపై యుద్ధమే
మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఇజ్రాయిల్ చర్యలు ఉన్నాయని బుధవారం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ఇరాన్ రాయబారి అలీ బహెరిని వ్యాఖ్యానించారు. అణు కేంద్రాలను ఉద్దేశ పూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడమంటే అంతర్జాతీయ చట్టాలను, ఐరాస నిబంధనావళిని ఉల్లంఘించడమేనని విమర్శించారు.
600 మంది మృతి
ఇరాన్వ్యాప్తంగా ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు 600 మంది మరణించారు. 1,326మంది గాయపడినట్టు వాషింగ్టన్కు చెందిన మానవహక్కుల సంస్థ బుధవారం ప్రకటించింది. మృతుల్లో 239మంది పౌరులు, 126మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది.
నటాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయిల్ దాడి : ఐక్యరాజ్యసమితి అణు సంస్థ వెల్లడి
ఇరాన్లో అత్యంత రహస్యమైన, సురక్షితమైన అణు కేంద్రాలలో ఒకటైన భూగర్భంలోని నటాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయిల్ దాడి చేసినట్టు ఐక్యరాజ్య సమితి అణు సంస్థ ప్రకటించింది. అయితే నటాంజ్ భూగర్భంలో ఉన్నందువల్ల దీనిపై దాడి చేయకపోవచ్చని ముందుగా భావించారు. కానీ నాటాంజ్ యురేనియం శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయిల్ నేరుగా దాడి చేసిందని, కొంతమేరకు ధ్వంసమైనట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) తెలిపింది. దాడుల తర్వాత సేకరించిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఆధారంగా నాటాంజ్పై దాడిని గుర్తించినట్టు ఐఎఇఎ తన ఎక్స్ పోస్టులో పేర్కొంది. ఇరాన్లోని మరో రెండు అణు కేంద్రాలు ఇస్ఫహాన్, ఫోర్డోపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది. అయినా పరిస్థితులను అంచనా వేస్తున్నామని ఐఎఇఎ పేర్కొంది. ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రాంతాన్ని నేరుగా పరిశీలించలేకపోయినట్టు ఐఎఇఎ తెలిపింది.