నవతెలంగాణ – హైదరాబాద్ : కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను అమెరికా ముందు ఉంచింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ పూర్తిగా మూసివేస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఇరాన్లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
ఇరాన్ కేవలం సైనిక స్థావరాల మూసివేతతోనే సరిపెట్టలేదు. తమపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తోంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు. పశ్చిమాసియాలోని మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాలు పరోక్షంగా తమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన డిమాండ్ల జాబితాను పంపింది.
ఇరాన్ ప్రధాన డిమాండ్లు ఇవే..
* గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నీ మూసివేయాలి.
* తమపై జరిగిన దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలి.
* వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిపై తమకు నియంత్రణ ఇవ్వాలి. సూయజ్ కెనాల్ తరహాలో ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి రుసుము వసూలు చేసే అధికారం కల్పించాలి.
* భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగవని హామీ ఇవ్వాలి.
* ఇరాన్ మిత్రపక్షమైన లెబనీస్ మిలీషియా హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలి.
* తమపై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి.
* తమ క్షిపణి కార్యక్రమాన్ని పరిమితం చేసే ఎలాంటి చర్చలు ఉండకూడదు.



