Saturday, June 14, 2025
E-PAPER
Homeజాతీయంఏఐతో ప్రమాదమా? ప్రయోజనమా?

ఏఐతో ప్రమాదమా? ప్రయోజనమా?

- Advertisement -

– ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తుంది
– 70 శాతం మంది గ్రాడ్యుయేట్ల భయం : సీఎఫ్‌ఏ సర్వే
న్యూఢిల్లీ:
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న, కొత్త అవకాశాలకు దారులు చూపెడుతున్న సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ (ఏఐ). ఇది ఇప్పటికే పలు సంస్థలకు సులువుగా పనిని చేసి పెడుతూ చాలా మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నది. ఇప్పుడు ఇదే విషయంలో పలువురు గ్రాడ్యుయేట్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ తమ ఉద్యోగావకాశాలను దెబ్బ తీస్తుందని 70 శాతం మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన శాంపిల్‌ సర్వేలో ఈ విషయం తేలింది. అలాగే, మరికొందరు ఈ ఏఐ విషయంలో సానుకూల అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏఐ లేదా ఆటోమేషన్‌ టూల్స్‌లో నైపుణ్యం పొందటం ద్వారా తమ కెరీర్‌ అవకాశాలు మెరుగుపడటానికి దోహదం చేస్తుందని మరికొందరు అంటున్నారు. సీఎఫ్‌ఏ అనేది ప్రపంచ పెట్టుబడి నిపుణుల సంఘం. ఇది ఇటీవలే గ్లోబల్‌ గ్రాడ్యుయేట్‌ ఔట్‌లుక్‌ సర్వే 2025ని విడుదల చేసింది. 9000 మందికి పైగా తాజా గ్రాడ్యుయేట్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత గ్రాడ్యుయేట్లలో ఏఐ, ఆటోమేషన్‌ టూల్స్‌ భయం ఎక్కువగా కనబడుతున్నది. ఇవి తాము కోరుకున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చాలా దెబ్బ తీసే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.50 శాతం మందికి పైగా తాము ఏఐను ప్రభావవంతంగా ఉపయోగించ గలమని విశ్వాసాన్ని వెలిబుచ్చారు. సంబంధిత సాఫ్ట్‌ స్కిల్స్‌ను కలిగి ఉండటమే కాకుండా.. ఏఐ నైపుణ్యాలు కలిగి ఉంటే ఉద్యోగ మార్కెట్‌లో మంచి అవకాశాలు లభిస్తాయని 56 శాతం మంది విశ్వసిస్తున్నారు.
ఏఐ కెరీర్‌లో స్థిరమైన వృద్ధి
ఆసక్తికరంగా ఏఐ కెరీర్లలోనూ స్థిరమైన పెరుగుదల కనిపిస్తున్నది. గతేడాది ఇది 59 శాతం నుంచి ఈ ఏడాది 63 శాతానికి పెరగటం గమనార్హం. ” ఈ తరానికి, ఏఐ ఇకపై కేవలం ఒక ఆప్షన్‌ కాదు. వృత్తిపరంగా ఎదుగుదలకు, సంబంధిత నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి దాని ప్రాముఖ్యతపై వారు అవగాహనను కలిగి ఉన్నారు” అని భారత్‌లో సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్‌ కంట్రీ హెడ్‌ అరాటి పోర్వాల్‌ అభిప్రాయపడ్డారు. గ్రాడ్యుయేట్లలో కెరీర్‌ ప్రాధాన్యతలకు సంబంధించి వరుసగా మూడేండ్లూ ఆర్థిక రంగమే అగ్రస్థానంలో ఉన్నది. ఈ రంగంపై 38 శాతం మంది చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఐటీ (32 శాతం), విద్య (21 శాతం) వంటి రంగాలున్నాయి. ”కాలంతో పాటు ఆర్థిక రంగం అభివృద్ధి చెందుతోంది. ఈ కొత్త వెర్షన్‌లో, జనరేటివ్‌ ఏఐ, బ్లాక్‌ చెయిన్‌ మొదలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయో గించి టెక్‌-ఎనేబుల్డ్‌ ఫైనాన్స్‌పై దృష్టి కేంద్రీకరి ంచబడింది. ఈ అభివృద్ధి చెందుతున్న రంగానికి విద్యార్థులు సంబంధిత శిక్షణను పొందటం తప్పనిసరి” అని డి.వై పాటిల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అర్చన సింగ్‌ చెప్పారు.
‘గ్రాడ్యుయేషన్‌ పూర్తైన వెంటనే ఉద్యోగం కావాలి’
తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే తాము ఉద్యోగాన్ని కోరుతున్నట్టు 40 శాతం మంది గ్రాడ్యుయేట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కంటే సర్టిఫికేషన్లు కెరీర్‌ వృద్ధికి దోహదం చేస్తాయని 68 శాతం మంది విశ్వసించారు. సర్టిఫికేషన్లు నేరుగా తమ ఉపాధి పొందే సామర్థ్యాన్ని, ఆదాయాలను మెరుగుపర్చాయని నివేదిక వివరించింది. ఏఐ అనేది కొందరికి ఆందోళనను, మరికొందరికి కొత్త ఆశలను కలిగిస్తున్నది. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకునే విధానాన్ని బట్టి దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు, మేధావులు చెప్తున్నారు. ఏఐ రాకతో పలు టెక్‌ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయనీ, రాబోయే కాలంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశమున్నదని ఇప్పటికే పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి, ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలనీ, ఏఐ విపరీత వినియోగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -