నవతెలంగాణ-హైదరాబాద్: ఉన్నావ్ లైంగికదాడి కేసు నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని నిరసిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగగా.. భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపడేశారు. తొలుత ఇండియా గేట్ వద్ద, ఆ తర్వాత మండీహౌజ్ వద్ద బాధితుల్ని సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వాళ్లను బలవంతంగా తమ వాహనాల్లో తరలించారు. ఆ రెండు చోట్లా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదని అధికారుల తెలిపారు. తాజాగా ఈ ఘటనపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు.
తనకు అన్యాయం జరిగిందంటూ నిరసన చేస్తున్న ఓ అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరించడం సమంజసమేనా..?న్యాయం కోసం గళం వినిపించడమే ఆమె చేసిన తప్పా..? అని ప్రశ్నించారు. అత్యాచార నిందితులకు బెయిల్ రావడం, బాధితులను నేరస్థులుగా చూడటం ఏ రకమైన న్యాయమని నిలదీశారు. ఇటువంటి అమానవీయ సంఘటనలతో మనం కూడా నిర్జీవ సమాజంగా మారుతున్నామన్నారు.



