Friday, June 20, 2025
E-PAPER
Homeఆటలుఆరంభం అదిరేనా?

ఆరంభం అదిరేనా?

- Advertisement -

– నేటి నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు
– కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌కు తొలి పరీక్ష
– ఇరు జట్లను వేధిస్తోన్న అనుభవలేమి
– మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, అజింక్య రహానె, చతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ దశాబ్దంలో భారత టెస్టు క్రికెట్‌ చాంపియన్లు. ఈ ఐదుగురు లేకుండా భారత్‌ చివరగా 2011 ఓవల్‌ టెస్టులో బరిలోకి దిగింది. ఆ సిరీస్‌లో భారత్‌ 0-4తో దారుణ ఓటమి చూసింది. 14 ఏండ్ల తర్వాత మళ్లీ ఆ ఐదుగురు లేకుండా ఇంగ్లాండ్‌లోనే భారత్‌ కొత్త ప్రయాణానికి సిద్ధమైంది.
కోహ్లి, రోహిత్‌ వీడ్కోలుతో భారత బ్యాటింగ్‌ అనుభవం లేమితో ఇబ్బంది పడుతుండగా.. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ విభాగం ఇదే సమస్యతో ఆందోళనలో పడింది. కుర్ర బౌలర్లతో బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్‌.. యువ సారథి శుభ్‌మన్‌ గిల్‌ సేనను ఏ విధంగా నిలువరిస్తుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
దిగ్గజాలు దూరమైనా.. భయమెరుగని క్రికెట్‌ ఆడటంలో మేటి బ్యాటర్లు భారత్‌ సొంతం. శుభ్‌మన్‌ గిల్‌ 25 ఏండ్లకే టెస్టు సారథ్యం అందుకుని చరిత్ర ఏమాత్రం మెరుగ్గా లేని ఇంగ్లాండ్‌లో వేటకు సిద్ధమవుతున్నాడు. పంత్‌, యశస్వి, గిల్‌ త్రయం ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ను జయిస్తుందా? లీడ్స్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-లీడ్స్‌

భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సమరంలో సరికొత్త శకం ఆరంభం. ఇప్పటివరకు నాలుగు టెస్టుల సిరీస్‌గా సాగిన భారత్‌, ఇంగ్లాండ్‌ ద్వైపాక్షిక టెస్టు పోరు.. ఇక నుంచి అల్టీమేట్‌ ఐదు టెస్టుల సిరీస్‌గా జరుగనుంది. భారత్‌, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ దిగ్గజాల పేరిటి జరుగుతున్న ‘టెండూల్కర్‌-అండర్సన్‌’ ట్రోఫీ కోసం బెన్‌స్టోక్స్‌, శుభ్‌మన్‌ గిల్‌ వేట మొదలెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బ్యాట్‌తో భారత్‌, బంతితో ఇంగ్లాండ్‌ సమస్యలు ఎదుర్కొంటూ.. తొలి టెస్టులో బరిలోకి దిగుతున్నాయి. అధిక ఉష్ణోగత్రల నడుమ జరుగుతున్న లీడ్స్‌ టెస్టులో విజయంతో సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని భారత్‌ ఎదురుచూస్తోంది. భారత్‌, ఇంగ్లాండ్‌ లీడ్స్‌ టెస్టు నేటి నుంచి ఆరంభం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలై.. రాత్రి 10.30 గంటలకు ఆట ముగియనుంది.
గిల్‌ మెరిసేనా?
25 ఏండ్ల గిల్‌ భారత్‌కు 35వ టెస్టు కెప్టెన్‌. 32 టెస్టుల్లో అతడి బ్యాటింగ్‌ సగటు 35.05. గిల్‌కు తుది జట్టులో చోటుకే అర్హత లేదంటూ విమర్శలు. కెప్టెన్‌గా కఠిన పరీక్షకు సిద్ధమవుతున్న గిల్‌.. బ్యాటర్‌గా మరింత కఠిన సవాల్‌ ఎదుర్కొనున్నాడు. నాయకుడిగా మెప్పు పొందేందుకు తొలుత బ్యాట్‌తో పరుగుల వేట సాగించాల్సిన అవసరం ఉంది. టెండూల్కర్‌, కోహ్లి బ్యాటింగ్‌ పొజిషన్‌ నం.4లో ఆడనున్న గిల్‌.. దిగ్గజాల తరహాలోనే పరుగుల వరద పారిస్తాడేమో చూడాలి. రిషబ్‌ పంత్‌, కెఎల్‌ రాహుల్‌కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తొలిసారి ఇంగ్లాండ్‌లో ఆడనున్నాడు. ఈ ముగ్గురు బ్యాటర్ల ప్రదర్శన భారత్‌కు కీలకం కానుంది. ఓపెనర్‌గా రోహిత్‌ స్థానంలో కెఎల్‌ రాహుల్‌ రావటం ఖాయం. దీంతో తుది జట్టులో రెండు స్థానాల కోసం ఐదుగురు పోటీపడుతున్నారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ రేసులో శార్దుల్‌ ఠాకూర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఉండగా.. నం.3 బ్యాటింగ్‌ పొజిషన్‌ కోసం అభిమన్యు ఈశ్వరన్‌, బి. సాయి సుదర్శన్‌ పోటీపడుతున్నారు. బ్యాటింగ్‌ లైనప్‌లో ఆరో స్థానం కోసం కరుణ్‌ నాయర్‌కు టాప్‌ ఆర్డర్‌లో చోటు దక్కని ఆటగాళ్ల నుంచి పోటీ కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా ప్రసిద్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లలో ఒకరు తుది జట్టులో నిలువనున్నారు. రవీంద్ర జడేజా స్పిన్‌ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కుల్‌దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
అదొక్కటే బలహీనత
బజ్‌బాల్‌ దూకుడుతో ఇంగ్లాండ్‌ భయమెరుగని క్రికెట్‌ ఆడుతోంది. హైదరాబాద్‌ టెస్టులో అదే గేమ్‌తో భారత్‌పై గెలుపొందింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌ను నిలువరించటం అంత సులువు కాదు. జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌ అంత సులువుగా వికెట్లు ఇవ్వరు. జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాట్‌తో ఇంగ్లాండ్‌కు పెద్దగా సమస్యలు లేవు. కానీ బౌలింగ్‌ విభాగంలో క్రిస్‌ వోక్స్‌ ఒక్కడే అనుభవజ్ఞుడు. బ్రాడన్‌ కార్స్‌, జోశ్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌లకు పెద్దగా అనుభవం లేదు. మార్క్‌వుడ్‌, ఒలీ స్టోన్‌ గాయాలకు గురవగా.. అటిక్సన్‌, ఆర్చర్‌ అందుబాటులో లేరు. దీంతో నాల్గో పేసర్‌ సేవలు సైతం ఇంగ్లాండ్‌కు దూరమయ్యాయి. అయినా, సొంతగడ్డపై స్టోక్స్‌సేన తొలి టెస్టులో ఫేవరేట్‌గా కనిపిస్తోంది.
పిచ్‌, వాతావరణం
లీడ్స్‌ పిచ్‌ పచ్చికతో కనిపిస్తోంది. పిచ్‌పై 8మీమీ మందంతో పచ్చికను ఉంచారు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో కంటే రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల వేట కాస్త సులువు!. ఇక్కడ జరిగిన చివరి ఆరు టెస్టుల్లో ఐదింట తొలుత బౌలింగ్‌ చేసిన జట్టు విజయం సాధించింది. చివరి నాలుగు టెస్టుల్లో 322, 359, 296, 251 లక్ష్యాలను అలవోకగా ఛేదించారు. దీంతో టాస్‌ నెగ్గిన జట్టు సహజంగానే తొలుత బౌలింగ్‌ ఎంచుకోనుంది. లీడ్స్‌లో ఫిబ్రవరి నుంచి వర్షాలు లేవు. బ్యాటర్లకు ఇది అనుకూలమే కానీ టెస్టు మ్యాచ్‌ జరిగే ఐదు రోజుల పాటు వర్షం సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం లేకుంటే.. మూడో రోజు నుంచే స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.
తుది జట్లు :
భారత్‌ (అంచనా) : యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌, బి సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కరుణ్‌ నాయర్‌, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, ప్రసిద్‌ కృష్ణ, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.
ఇంగ్లాండ్‌ : జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జెమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రాడన్‌ కార్స్‌, జోశ్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -