Friday, May 30, 2025
E-PAPER
Homeజాతీయంనాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థకు అర్థం ఇదేనా?

నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థకు అర్థం ఇదేనా?

- Advertisement -

– దేశం మాత్రమే సంపన్నమవుతోంది..ప్రజలు కాదు
– ఇబ్బందుల్లో జనం.. సుసంపన్నమని మోడీ ప్రచారం
– తలసరి ఆదాయాలు చాలా తక్కువ
– ఒక శాతం మంది ధనవంతుల చేతిలోనే సంపద
– ఆర్థిక నిపుణులు, మేధావుల ప్రశ్నలు
ఇటీవల భారత్‌.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. జపాన్‌ను అధిగమించి భారత్‌ ఐదో స్థానం నుంచి ఒక మెట్టు పైకి ఎక్కినట్టు వివరించాయి. ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా మోడీ సర్కారు చెప్తున్నది. అయితే, దేశంలోని ప్రజల ఆర్థిక పరిస్థితులలో ఎలాంటి సానుకూల మార్పులూ కనిపించటం లేదని ఆర్థిక నిపుణులు, మేధావులు చెప్తున్నారు. దేశ సంపదంతా టాప్‌ ఒక శాతం మంది అత్యధిక ధనవంతుల చేతిలో ఉన్నదని గుర్తు చేస్తున్నారు. ప్రజల తలసరి ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: కేంద్రంలో మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ మేడిపండు చందంగా ఉన్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించినంత ముందుకు సాగలేదు. ఇందుకు మోడీ సర్కారు అనుసరిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలే కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటంలో విఫలమైందని చెప్తున్నారు. పెట్రోల్‌, డీజీల్‌, వంటగ్యాస్‌, ఇతర నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల జేబులకు చిల్లులు పడిన విధానాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో భారత్‌.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు వార్తలు రావటం పట్ల వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌ను అధిగమించి భారత్‌ ఈ ఘనత సాధించినట్టు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) గణాంకాలు వివరిస్తున్నాయి. భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే.. దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా అదే స్థాయిలో మారాలి. అలాంటప్పుడే దానిని అసలైన ఆర్థిక వృద్ధి అంటారు. అయితే, దేశంలోని పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ర్యాంకుల జాబితాలో భారత్‌ ఒక మెట్టు పైకి ఎక్కిందని చెప్తున్నా.. ప్రజల తలసరి ఆదాయాల్లో మాత్రం చెప్పుకోదగిన మార్పు రాలేదని గణాంకాలు చెప్తున్నాయి. ఈ విషయంలో మనం మనకంటే చిన్న దేశాలకన్నా వెనుకబడి ఉన్నామని స్పష్టమవుతున్నది. దేశం మాత్రమే సంపన్నమవుతోంది తప్పితే ప్రజలు మాత్రం కాదని అర్థమవుతున్నది.
తలసరి ఆదాయంలో భారత్‌కు, జపాన్‌కు మధ్య భారీ వ్యత్యాసం
ఈ ఏడాది ఏప్రిల్‌ మాసానికి నామినల్‌ జీడీపీ ఆధారంగా భారత్‌.. జపాన్‌ను అధిగమించినట్టు ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఈ సంస్థ సమాచారం ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థ 4.187 ట్రిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానానికి చేరింది. ఐదో స్థానానికి పడిపోయిన జపాన్‌ ఆర్థిక వ్యవస్థ 4.186 ట్రిలియన్‌ డాలర్లు. రెండు దేశాల మధ్య వ్యత్యాసం స్వల్పంగానే ఉన్నది. అయితే, ఈ రెండు దేశాల మధ్య ఉన్న తలసరి ఆదాయాల్లో భారీ తేడాలు ఆశ్చర్యం కలిగించక మానవు. జపాన్‌ తలసరి ఆదాయం 33,900 డాలర్లుగా ఉన్నది. అయితే, ఇది భారత్‌లో మాత్రం 2,880 డాలర్లు మాత్రమే కావటం గమనార్హం. భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ.. ఇక్కడి ప్రజల ఆదాయాలు పెరగలేదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
అసమానతలు ఆందోళనకరం
భారత్‌లో ధనిక, పేద అసమానతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రపంచ అసమానతల నివేదిక(2022) ప్రకారం భారత్‌లో దేశ సంపదలో 40 శాతం కంటే ఎక్కువ టాప్‌లో ఉన్న ఒక్క శాతం మంది సంపన్నుల చేతుల్లోనే ఉన్నది. ఇక అట్టడుగు స్థానంలో ఉన్న 50 శాతం మంది చేతిలో మాత్రం మూడు శాతం సంపద మాత్రమే ఉండటం గమనార్హం. పది శాతం మంది మాత్రమే జాతీయ ఆదాయంలో 57 శాతానికి పైగా సంపాదిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ర్యాంకులతో దేశ అభివృద్ధిని కొలవలేమనీ, దేశంలోని సాధారణ పౌరుడి ఆదాయాలు, జీవన ప్రమాణాలు మారినపుడే అసలైన అభివృద్ధికి అర్థమని మేధావులు అంటున్నారు. ధనిక, పేద మధ్య ఉన్న ఈ లోతైన అసమానతల అంతరాన్ని రూపుమాపాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలని వారు సూచిస్తున్నారు.

చైనాతో పోటీ ఇలాగేనా..!?
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనాది రెండో స్థానం. 19.23 ట్రిలియన్‌ డాలర్లతో ఈ ఆసియా దేశం ప్రపంచంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది. అమెరికాకు సవాలు విసురుతున్నది. చైనా ఒకప్పుడు నాలుగు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరినప్పుడు దేశంలో తలసరి ఆదాయం 3500 డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న తలసరి ఆదాయం కంటే ఎక్కువే. ప్రస్తుతం చైనా తలసరి ఆదాయం 13,000 డాలర్లుగా ఉన్నది. ఇది భారత తలసరి ఆదాయం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావటం గమనార్హం. చైనాతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నామని చెప్పుకునే మోడీ సర్కారు.. తలసరి ఆదాయం విషయాన్ని గమనించాల్సిన అవసరాన్ని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -