నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ తీవ్ర పరిణామాలను చవిచూస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడుల్లో ఇద్దరు సీనియర్ సైనిక కమాండర్లు, అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలు మరణించిన సంగతి తెలిసిందే. దాడులపై ఇరాన్ తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని ప్రతిజ్ఞ చేసింది. ఈ నేరంతో ఇజ్రాయిల్ తీవ్రమైన, బాధాకరమైన పరిణామాలను ఎదుర్కొంటుందని ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ తీసుకునే చర్యలకు ఇజ్రాయిల్ కఠినమైన శిక్ష ఎదుర్కోవలసి వుంటుందని ఖమేనీ అన్నారు. ఇజ్రాయిల్ క్రూరమైన, రక్తపు మరకల చేతులతో తమ దేశంలో నేరానికి తెరతీసిందని అన్నారు.
నివాస కేంద్రాలపై దాడితో ఇజ్రాయిల్ దుర్మార్గపు స్వభావాన్ని గతంలో కంటే అధికంగా బయటపెట్టిందని అన్నారు. ఇజ్రాయిల్ ప్రాణాంతక దాడులకు ప్రతిస్పందించేందుకు తమకు న్యాయమైన చట్టబద్ధమైన హక్కు ఉందని తెలిపారు. ఐరాస నిబంధనల్లోని ఆర్టికల్ 51 ప్రకారం దురాక్రమణకు ప్రతిస్పందించడానికి తమకు చట్టపరమైన హక్కు ఉందని పేర్కొన్నారు. ఇరాన్ సాయుధ దళాలు తమ శక్తి మేరకు దేశాన్ని రక్షించేందుకు యత్నిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడుల పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి వుంటుందని ఇరాన్ పేర్కొంది.
తమ చీఫ్ హుస్సేన్ సలామీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా ప్రతిజ్ఞ చేసింది. కఠినమైన, విచారకరమైన ప్రతీకారం కోసం ఇజ్రాయిల్ వేచి ఉండాలని ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ బాఘేరీ, సీనియర్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ అలీ రషీద్ మరణించారని ఇరాన్ మీడియా ప్రకటించింది. అణు శాస్త్రవేత్తలు మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చీ మరియు ఫెరెడౌన్ అబ్బాసీలు మరణించారని తెలిపింది.