నవతెలంగాణ-హైదరాబాద్: గాజా పట్ల ఇజ్రాయెల్ తన వైఖరి మార్చుకోవాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సూచించారు. కచ్చితంగా పాలస్తీనా దేశం ఉండాల్సిందేనని మాక్రాన్ తేల్చి చెప్పారు. గాజాలో మానవీయ సాయాన్ని అడ్డుకోవడం భావ్యం కాదని.. ఇలాగైతే టెల్ అవీవ్పై కఠిన వైఖరి అవలంభించాల్సి వస్తోందని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు. రెండు దేశాల సిద్ధాంతానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో కలిసి మాట్లాడుతుండగా మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా అమెరికా సాయంతో ఇజ్రాయెల్.. హమాస్కు కొత్త ప్రతిపాదన పెట్టింది. 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరిస్తూ బందీలను విడుదల చేయాలని హమాస్ ముందు ప్రతిపాదన పెట్టగా తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదన పూర్తి వ్యతిరేకంగా ఉందని.. కేవలం బందీల విడుదల కోసమే ప్రతిపాదన ఉందని.. కానీ యుద్ధం ముగింపునకు మాత్రం ఎలాంటి చర్చలు జరపలేదని హమాస్ నేత మీడియాకు వెల్లడించారు. అందుకే అమెరికా ప్రతిపాదనను తిరస్కరించినట్లు హమాస్ తెలిపింది.