నవతెలంగాణ-హైదరాబాద్: కాల్పలు విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించిన కొన్ని గంటలకే ఇరాన్పై దాడులకు ఇజ్రాయిల్ ఆదేశించింది. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు తీవ్రంగా స్పందించనున్నామని ఇజ్రాయిల్ పేర్కొంది. కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయిల్ ఈ ప్రకటన విడుదల చేసింది.తమ దేశంపై ఇరాన్ క్షిపణుల దాడికి దిగినట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది.
అయితే క్షిపణుల ప్రయోగాన్ని ఇరాన్ ఖండించింది. ఇజ్రాయిల్ దురాక్రమణ చర్యకు ప్రతిస్పందనగా తీవ్ర హెచ్చరిక ఉంటుందని పేర్కొంది. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు వ్యతిరేకంగా సెంట్రల్ టెహ్రాన్లోని ప్రభుత్వ లక్ష్యాలపై దాడులు చేయడం ద్వారా తీవ్రంగా స్పందించాలని తాను సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముందుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దశలవారీగా 24 గంటల కాల్పుల విరమణ ప్రక్రియను ప్రకటించారు. ఈ ఒప్పందానికి ఇజ్రాయిల్, ఇరాన్లు అంగీకరించాయి. తొలుత ఇరాన్ అంగీకరించలేదని, కానీ తాజా దాడుల తర్వాత జాతీయ భద్రతా కౌన్సిల్ ఒప్పందాన్ని అంగీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిందని పేర్కొంది.
కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇజ్రాయిల్పై క్షిపణి దాడులను ఖండించినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. గత కొన్ని గంటలుగా ఇరాన్ నుండి ఎటువంటి క్షిపణులను ప్రయోగించలేదని వెల్లడించింది.