నవతెలంగాణ-హైదరాబాద్: ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో 22 యూదు స్థావరాలను నిర్మిస్తామని ఇజ్రాయెల్ గురువారం ప్రకటించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇప్పటికే నిర్మించిన స్థావరాలను కూడా చట్టబద్ధం చేస్తామని తెలిపింది. ” ఈ నిర్ణయం ‘ యూదయ, సమారియా’పై మా పట్టును బలపరుస్తుంది” అని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిలె కాట్జ్ పేర్కొన్నారు. వెస్ట్బ్యాంక్ మరోపేరును ప్రస్తావించారు. ”ఇజ్రాయిల్ భూమిలో మా చారిత్రక హక్కును నిలుపుకుంటుంది, పాలస్తీనా ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రతిస్పందనగా ఉంటుంది” అని అన్నారు. ఇది ఇజ్రాయిల్కు ప్రమాదం కలిగించే పాలస్తీనా రాజ్య స్థాపనను నిరోధించే వ్యూహాత్మక చర్య అని కూడా అన్నారు.
ఇజ్రాయిల్ ఇప్పటికే ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో 100కిపైగా స్థావరాలను నిర్మించింది. వీటిలో సుమారు 5,00,000 మంది నివసిస్తున్నారు. కొండ శిఖరంపై చిన్న పాటి స్థావరాల నుండి అపార్ట్మెంట్ బ్లాక్లు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు మరియు పబ్లిక్ పార్క్లతో పూర్తిగా అభివృద్ధి చెందిన కమ్యూనిటీల వరకు ఉన్నాయి. వెస్ట్బ్యాంక్లో 30 లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. వారు ఇజ్రాయిల్ సైనిక పాలనలో ఉండగా, పాశ్చాత్య దేశాల మద్దతుగల పాలస్తీనియన్ అథారిటీ జనాభా కేంద్రాలను నిర్వహిస్తుంది. ఇక్కడి స్థిరనివాసులకు ఇజ్రాయిల్ పౌరసత్వం ఉంది. ఇజ్రాయిల్ ఇటీవల స్థిరనివాస నిర్మాణాలను వేగవంతం చేసింది.