నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ గాజా శాంతి ప్రణాళిక ఒప్పందాన్ని ఉల్లంఘించి దాష్టీకానికి పాల్పడింది. ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. ఉత్తర గాజాలోని తమ దళాలకు సమీపంగా వచ్చిన అనుమానితులపై కాల్పులు జరిపినట్లు ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం తెలిపింది. అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ పథకం కింద ప్రారంభ ఉపసంహరణ సమయంలో.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అనుమానితులు సరిహద్దును దాటారని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది.
ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. మంగళవారం గాజా భూభాగంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇజ్రాయిల్ సైన్యం ఆరుగురు పాలస్తీనియన్లను చంపిందని గాజా స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
సోమవారం హమాస్ ఇజ్రాయిల్ బందీలను విడిచిపెట్టగా, ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను పంపింది. పశ్చిమాసియా ప్రాంతాన్ని కుదిపేసిన రెండు సంవత్సరాల యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.