ఇరాన్ టాప్ కమాండర్ మృతి
టెల్ అవీవ్సహా పలు నగరాలపై
ఇరాన్ ప్రతి దాడులు
టెల్ అవీవ్, టెహరాన్ : వరుసగా తొమ్మిదో రోజైన శనివారం కూడా ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని క్షిపణి కేంద్రాలు, ఇస్ఫాహన్ అణు కేంద్రంపై ఇజ్రాయిల్ శనివారం తాజాగా దాడులు జరిపింది. విదేశాల్లో మిలటరీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తు న్న సీనియర్ కమాండర్ను హతమార్చినట్టు ప్రకటించింది. ఆ కమాండర్ను మహ్మద్ సయీద్ ఇజాదిగా గుర్తించామని ఇజ్రాయిల్ రక్షణ శాఖ ప్రకటించింది. హమాస్ వంటి గ్రూపులతో ఇరాన్ సంబంధాలను పర్యవేక్షించే ఇజాది, ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ వర్గాలకు దీర్ఘకాలంగా లక్ష్యంగా వున్నారు. అక్టోబరు 7 దాడుల గురించి ముందుగా తెలిసిన అతికొద్ది మందిలో ఇజాది కూడా ఒకరు. సెంట్రల్ ఇరాన్లో ఇజాది నివసిస్తున్న అపార్ట్మెంట్పై శనివారం తెల్లవారు జామున దాడిచేసి, హత్య చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. వాయవ్య ఇరాన్లోని మిలటరీ సదుపాయాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడులు కొనసాగిస్తున్నాయని మిలటరీ ప్రకటించింది. శనివారం ఇరాన్ ప్రయోగించిన దాదాపు 40 డ్రోన్లను కూల్చివేసినట్ల ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. దాదాపు మూడు రోజులుగా ఇరాన్వ్యాప్తంగా ఇంటర్నెట్ దాదాపుగా స్తంభించిపోయింది. శనివారం ఉదయానికి పాక్షికంగా సేవలు పునరుద్ధరిస్తున్నట్టు ఇంటర్నెట్ పర్యవేక్షక గ్రూపు పేర్కొంది. శనివారం నాటి దాడుల్లో ఆక్రమిత పాలస్తీనా భూభాగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాదాపు 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, పలు ఇజ్రాయిల్ నగరాలను డజన్లసంఖ్యలో ‘విధ్వంసకర’ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. అనేక డ్రోన్లు తమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని కూడా సమాచారం వచ్చినట్లు ఇర్నా తెలిపింది. టెల్ అవీవ్లో శనివారం తెల్లవారు జామున పలు చోట్ల పేలుళ్ళు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నగరమంతా పెద్ద పెద్ద శబ్దాలు చాలాసార్లు వినిపించాయని ప్రజలు తెలిపారు. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత కొన్ని క్షిపణులు ఇజ్రాయిల్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని మరీ చొచ్చుకుపోయినట్లు తెలుస్తోంది.
అణు చర్యలకు విఘాతం కలిగించడమే ఇజ్రాయిల్ ఉద్దేశం : టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్
అమెరికాతో అణు చర్చలకు విఘాతం కలిగిం చాలన్నదే ఇజ్రాయిల్ ఉద్దేశంగా వున్నట్టు కనిపిస్తోందని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్ విమర్శించారు. పశ్చిమాసియాను మొత్తంగా వినాశనం వైపునకు ఇజ్రాయిల్ లాక్కువెళుతోందని వ్యాఖ్యా నించారు. దౌత్యానికి అవకాశం కల్పించేందుకు తాము రెండు వారాల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని భావించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయిల్ తన దూకుడు ను తక్షణమే నిలిపివేస్తే ఇరాన్ దౌత్య పంథాను పరిశీలిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ దురా క్రమణకు అమెరికా చేతు లు కలిపితే ప్రతి ఒక్కరికీ ప్రమాదమేనని ఆయన హెచ్చరించారు. యూరో పియన్ మంత్రులు, ఇరాన్ మధ్య అణు చర్చలను వేగిర పరిచేందుకు చర్యలు తీసుకోవా లని తాను, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెషికాన్ ఒక అంగీకారానికి వచ్చినట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ తెలిపారు.
ఇరాన్లో కంపించిన భూమి
ఉత్తర ఇరాన్లో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.1గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వీసెస్ (యూఎస్జీఎస్) తెలిపింది. సెమ్నాన్ నగరానికి వాయవ్యంగా భూమిలో 10కి.మీ. లోతున భూకంపకేంద్రం వున్నట్లు గుర్తించారు.
ఇరాన్పై దాడులను ఖండించిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)
ఇరాన్పై ఇజ్రాయిల్ పాల్పడుతున్న దాడులను షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసి యాలో నెలకొన్న పరిణామాల పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. నివాసప్రాంతాలు, పౌరులను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా అణుశక్తి కేంద్రాలపై కూడా దాడులు చేయడం అంతర్జాతీయచట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది.
భద్రతా మండలికి ఫిర్యాదు
అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదంటూ ఇరాన్ రాయబారి, ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక ప్రతినిధి అమిర్ సయీద్ ఇర్వాని శుక్రవారం యూఎన్ ప్రధాన కార్యదర్శికి, భద్రతామండలి అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన సమయంలో ఐఎఇఎ డైరెక్టర్ జనరల్ గ్రాసి చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు చట్టబద్ధంగా లేవని ఖండించారు.
దాడులు చేస్తామంటూ హౌతీల హెచ్చరిక
ఇరాన్పై దాడుల్లో అమెరికా కూడా చేతులు కలిపితే ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలపై తాము దాడులు చేస్తామని హౌతీ తీవ్రవాదులు హెచ్చరించారు. ఈమేరకు యెమెన్కి చెందిన హౌతీ గ్రూపు ప్రతినిధి శనివారం ఒక ప్రకటన చేశారు. మే నెల్లోనే అమెరికా, హౌతీల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఒకరిని ఒకరు లక్ష్యంగా చేసుకోరాదని నిర్ణయించారు.
ఇజ్రాయిల్ దూకుడును ఖండించిన అరబ్ లీగ్
ఇస్తాంబుల్ : ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఈ మిలటరీ దాడులకు స్వస్తి పలకాలని పిలుపిచ్చారు. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే ప్రాంతీయ సుస్థిరతకు తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
శనివారం ఇస్లామిక్ దేశాల సహకార మండలి (ఓఐసీ) 51వ సమావేశాలకు ముందుగా ఇస్తాంబుల్లో అరబ్ మంత్రులు, పెచ్చరిల్లుతున్న ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి సభ్య దేశ సార్వభౌమాధికారాన్ని దారుణంగా ఉల్లంఘించి ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిందని అరబ్ లీగ్ విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది.
400 మందికి పైగా మృతి
ఇజ్రాయిల్ ఈనెల 13న దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 400మందికిపైగా మరణించారని, వీరిలో 54మంది మహిళలు, పిల్లలు వున్నారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 3,056మంది గాయపడ్డారని తెలిపింది. మృతుల్లో ఎక్కువమంది సామాన్య పౌరులేనని ఆరోగ్య శాఖ ప్రతినిధి తెలిపారు. వాయవ్య ఇరాన్లో జరిగిన దాడిలో నలుగురు రివల్యూషనరీ గార్డులుఎ మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
ప్రాంతీయ శాంతి భద్రతలకు ఈ దాడులు తీవ్ర ముప్పుగా పరిణమించాయని ఆ ప్రకటన పేర్కొంది. అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిష్క్రియాపరత్వం ఇలాగే కొనసాగితే పశ్చిమాసియాలో మరింత అస్థిరత నెలకొనే ప్రమాదముందన్నారు. గాజాలో కూడా ఇజ్రాయిల్ తన సైనిక దురాక్రమణను తక్షణమే ఆపాలని ఆ ప్రకటనలో మంత్రులు కోరారు. ఇజ్రాయిల్ దూకుడు వైఖరితో విస్తృతమైన ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదముందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను పునరుద్ధరించాలని కోరారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో అన్ని దేశాలు చేరాలని వారు కోరారు. అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గుర్తించాల్సిన అవసరం వుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది.
ఇజ్రాయిల్ వైమానిక దాడులు ఉధృతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES