నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్ పై భీకరదాడులకు తెగబడుతోంది.
ఇరాన్లోని కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులకు పాల్పడిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని అన్నారు. దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం.. డ్రోన్ యూనిట్ కమాండర్ను చంపాయని ఐడీఎఫ్ ప్రకటించింది. టెల్ అవీవ్పై ఇరాన్ చేసిన వందలాది డ్రోన్ దాడులకు అతడు ప్రాతినిథ్యం వహించాడని తెలిపింది.
టెహ్రాన్ సహా ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. పశ్చిమ ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కాస్పియన్ సముద్రం సమీపంలోని రాస్త్ నగరంపైనా టెల్అవీవ్ బాంబులతో విరుచుకుపడింది. దీనికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న దాడుల్లో గోలన్ హైట్స్లోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను జనావాసాలు లేని ప్రాంతాల్లో కూల్చివేయడంతో ప్రజలకు ఎటువంటి హానీ జరగలేదని ఇజ్రాయెల్ తెలిపింది.