Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅమెరికా అండతో ఇజ్రాయిల్‌ దాడులు

అమెరికా అండతో ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

– సామ్రాజ్యవాద ధోరణితో యుద్ధాలను ప్రోత్సహిస్తున్న యూఎస్‌
– ట్రంప్‌ను మోడీ అనుసరించడం దేశానికే నష్టం
– ప్రధాని మౌనం దేశ ప్రజలకు అవమానం
– హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట
– వామపక్షాల ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నేతల అరెస్టు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

అమెరికా అండతోనే ఇజ్రాయిల్‌ దేశం పాలస్తీనా, గాజా ప్రజలపై మారణహౌమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి సిద్ధమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద ధోరణితో డబ్బు, ఆయుధ సంపద ఉందని అమెరికా వివిధ దేశాల మధ్య యుద్ధాలను ప్రేరేపించడం దుర్మార్గమన్నారు. అమెరికా స్వప్రయోజనాల కోసం చేస్తున్న ఈ దుశ్చర్యలను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని, తిరుగుబాటు మొదలవుతుందని తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా పైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, గోవర్దన్‌, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు రమేష్‌రాజా, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు మురహరి తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న మారణహౌమాన్ని నిలిపివేయాలని, యుద్ధాలను ప్రేరేపిస్తున్న అమెరికా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, మోడీ ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరాను నిలిపి వేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించే ప్రయ్నతం చేశారు. మాదాపూర్‌ అడిషనల్‌ డీసీపీ ఉదరురెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిరసనకారుల ను అరెస్టు చేసి నార్సింగి, గచ్చిబౌలి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఒక దేశం మరొక దేశ భూభాగాన్ని, ఆ దేశ సంపదను దోచుకోవాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇజ్రాయిల్‌ తమకు అండగా అమెరికా ఉందని పాలస్తీనా ప్రజలపై దాడులకు పాల్పడుతుందని చెప్పారు. ఇజ్రాయిల్‌ వికృత చేష్టలకు పాల్పడుతూ పాలస్తీనా, గాజా నగరాల్లోని ప్రజలకు కనీసం తాగునీరు కూడా దొరకకుండా చేస్తున్నదనీ, అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. తిండి, వైద్యం అందక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌పై దాడికి అమెరికా ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నదని వివరించారు. సామ్రాజ్యవాద ధోరణిని అవలంబిస్తున్న ట్రంప్‌ను మోడీ అనుసరిస్తున్నారనీ, దేశ రక్షణ కోసం సొంత నిర్ణయం తీసుకోలేని నాయకుడిగా నిలిచారని విమర్శించారు.ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధం విషయంలో ఇజ్రాయిల్‌ను ప్రోత్సహించే విషయంలో భారత్‌ వెనక్కి తగ్గాలన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్‌ మాట్లాడుతూ పశ్చిమాసియా దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి అమెరికా ఇజ్రాయిల్‌ను పావుగా వాడుకుంటుందన్నారు. ఇస్లామిక్‌ దేశాలను అణిచివేయడానికి అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ కుట్రలు చేస్తున్నారన్నారు. 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయిల్‌.. రూ.9 కోట్ల జనాభా ఉన్న ఇరాన్‌పై దాడి చేసే శక్తి ఉంటుందా అని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు డీజీ నర్సింగరావు మాట్లాడుతూ.. వైట్‌హౌస్‌ ఎదుట ఆ దేశ ప్రజలు నిరసన తెలపడానికి అక్కడి ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తున్నప్పుడు ఒక కార్యాలయం ఎదుట నిరసన తెలిపితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అరెస్టులు చేస్తున్నదని ఫ్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.శ్రీరాంనాయక్‌, పి.ఆశయ్య, ఉడుత రవీందర్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ పాల్గొన్నారు.

పలు జిల్లాల్లో నిరసనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ట్రంప్‌ అండతోనే దాడులు జరుగుతున్నాయని, ఇరాన్‌కు భారత్‌ అండగా ఉండాలని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో అమెరికా, ఇజ్రాయిల్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్‌, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ నగర కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడారు. నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సుభాష్‌ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ క్రూరమైన దాడులపై మోడీ ప్రభుత్వం మౌనం వీడాలన్నారు. హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐఎస్‌ సదన్‌ చౌరస్తా సంతోష్‌నగర్‌లో నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్‌ చౌక్‌ దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన తెలుపుతూ ఆందోళన నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -