Sunday, June 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఈటలది తప్పుడు వాంగ్మూలం

ఈటలది తప్పుడు వాంగ్మూలం

- Advertisement -

– నన్ను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు
– ప్రాజెక్ట్‌ అనుమతి అంశం క్యాబినెట్లో ఎప్పుడూ చర్చించలేదు
– అన్ని విషయాలు కమిషన్‌కు లిఖిత పూర్వకంగా అందజేస్తాం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు ఈటల రాజేందర్‌ కాళేశ్వరం కమిషన్‌ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎవరిని రక్షించేందుకు ఆయన అబద్ధాలాడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రాణహిత, దేవాదుల, కాంతలపల్లి, తుపాకుల గూడెం పనుల కోసం సబ్‌ కమిటీ వేశారని మంత్రి తెలిపారు. కాళేశ్వరం నిర్మాణానికి సబ్‌ కమిటీ ఆమోదం తెలిపిందనడం అబద్ధమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తాను మంత్రిగా ఉన్న కాలంలో ప్రాజెక్ట్‌ అనుమతులకు సంబంధించి క్యాబినెట్‌ సబ్‌కమిటిలో గాని, క్యాబినెట్లో గాని ఆమోదం పొందలేదని తుమ్మల స్పష్టం చేశారు. ‘కాళేశ్వరం ఎప్పుడూ క్యాబినెట్‌ ముందుకు రాలేదు. పరిపాలన అనుమతులతోనే నిర్మాణ పనులు చేపట్టారు. ఈటల రాజేందర్‌ కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్‌ ముందు ఆయనకు అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. తన పట్ల నాకు గౌరవం ఉంది. కానీ ప్రకటన చూసిన తర్వాత కొంత బాధేసింది. కమిషన్‌ వివాదంలోకి నన్ను ఎందుకు లాగాల్సి వచ్చిందో ఈటలే చెప్పాలి. తుమ్మల కూడ కాళేశ్వరం కోసం సబ్‌ కమిటీ రిపోర్ట్‌పై సంతకం చేశారని ఇచ్చిన వాగ్మూలం బాధాకరం. కాళేశ్వరం క్యాబినెట్‌ ఉమ్మడి నిర్ణయమని చెప్పడం సరికాదు. హరీష్‌రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నా రు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. రాజకీయ లబ్దికోసం నీచ రాజకీయాలకు పాల్పడటం సరికాదు. ఇప్పటికైనా ఈటల ఆత్మ విమర్శ చేసుకుని తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాలి” అని తుమ్మల డిమాండ్‌ చేశారు. కొంతమంది పెద్దలను తప్పించేందకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిరుపయోగమని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్మాణానికి మొగ్గు చూపిందని ఆరోపించారు. మంత్రి మండలి సమావేశాల్లో పలు మార్లు అంతర్గతంగా తాను వాటితో విభేదించానని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ కాళేశ్వరంపై నివేదిక ఇవ్వలేదనీ, అన్ని ఆధారాలతో సుమోటోగా కమిషన్‌కు అందజేస్తానని తుమ్మల తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -