సిపిఐఎంఎల్ మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
భారతదేశంలోని పేద వర్గాల సకల సమస్యలను తీర్చే పేదల రాజ్యం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి నేటికీ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండలంలో ని మెచరాజుపల్లి గ్రామం లో సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ జండాను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రన్న మాట్లాడుతూ సంస్థానాధీశులు, వలస పాలకులైన బ్రిటిష్ వారి దోపిడీకి భూస్వామ్య, పెట్టుబడి దారి దోపిడీలపై పేదలకు అండగా ఎర్ర జెండా పార్టీ నిలిచిందని అన్నారు. వేలాది మంది రక్తతర్పణలు చేసి ప్రాణాలు ఇచ్చారాని,లక్షలాదిమంది తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొన్నారని అన్నారు.పేదలకు భూమి ఉపాధి ఆత్మగౌరవాన్ని అందించిన కమ్యూనిస్టు పార్టీ వారి విముక్తికి కూడా పాటుపడుతుందని అన్నారు.
తరతరాలుగా పేద సామాన్య మధ్యతరగతి ప్రజానీకం పై భూస్వామ్య విధానం భావజాలం ఆధిపత్యం వేయిస్తే మట్టి మనుషులకు వర్గ చైతన్యం అందించి తిరుగుబాటు చేయించిందని అన్నారు. నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా ద్రోహకరమైన విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అమలులో గాలికి వదిలేసిందని అన్నారు. యూరియాను అందించలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు జక్కుల యాకయ్య తోపాటు దొడ్డ కేశవులు రవీందర్ ఐలయ్య రాములు మహేష్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



