నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దోపిడీ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్ మండపం సమీపంలో కొందరు దుండగులు దారికాచి రూ.కోటి విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఢిల్లీకి చెందిన శివమ్కుమార్ యాదవ్, రాఘవ్ బంగారు ఆభరణాల బ్యాగులను తీసుకుని తమ స్కూటర్పై చాందినీ చౌక్ నుంచి భైరాన్ మందిర్కు బయల్దేరారు. అక్కడి నగల దుకాణంలో వీటిని ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండుగులు బైక్పై వచ్చి వారిని అడ్డుకున్నారు. అందరూ చూస్తుండగానే తుపాకీతో బెదిరించి వీరి వద్ద ఉన్న నగల బ్యాగులను లాగేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 500 గ్రాముల బంగారం, దాదాపు 35 కిలోల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. మార్కెట్లో వీటి విలువ రూ.కోటి పైనే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.