Thursday, June 5, 2025
E-PAPER
HomeNewsజీవో 8ని సవరించాలి

జీవో 8ని సవరించాలి

- Advertisement -

– 2024 జులై 1 తర్వాత రిటైర్మెంటైన అంగన్‌వాడీలందరికీ వర్తింపజేయాలి : అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి
– మంత్రి సీతక్కకు వినతి
నవతెలంగాణ – ములుగు

జీవో 8ని సవరించి 2024 జులై1 తర్వాత రిటైర్మెంట్‌ అయిన 10వేలమంది అంగన్‌వాడీలకూ వర్తింపజేయాలని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు, హెల్పర్స్‌కు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ, 60 ఏండ్లు దాటిన వారికి వాలంటరీ రిటైర్మెంట్‌ నిర్ణయం చేస్తూ, పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తూ జూన్‌ 30న జీవో 8ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. మంత్రి సీతక్క స్పందించి మాట్లాడుతూ.. అంగన్‌వాడీలు కోరిన విధంగా జులై 1 నుంచి రిటైర్మెంటైన వారందరికీ వర్తించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు కారుణ్య నియామకాలు చేపడతామని, మినీ టీచర్స్‌ పెండింగ్‌ ఏరియర్స్‌ కూడా చెల్లిస్తామని తెలిపారు. గతేడాది 24 రోజుల సమ్మె వేతనాలు కూడా చెల్లిస్తామన్నారు.
అనంతరం జయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ జీవోతో రిటైర్మెంట్‌ అయిన 10వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారనీ, వెంటనే జీవోను సవరించాలని కోరారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచాలని కోరుతూ 2023 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో 24 రోజులు రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారనీ, అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారని గుర్తు చేశారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించినట్టు చెప్పారు. జులై 19న ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ ఎదుట ధర్నా చేశామన్నారు. ఆ సమయంలో మంత్రి సీతక్క యూనియన్‌తో చర్చలు జరిపి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచుతామని, వీఆర్‌ఎస్‌ సౌకర్యం కల్పిస్తామని, పెన్షన్‌ ఇస్తామని చెప్పినట్టు గుర్తు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్‌ 12న చలో హైదరాబాద్‌, 2025 మార్చి 17,18 తేదీల్లో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట 48 గంటల ధర్నా, వంటా వార్పు నిర్వహించామన్నారు. సీఐటీయూ నిరంతరం చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచుతూ జీవో ఇచ్చిందని తెలిపారు. కానీ, ఈ జీవోలో 2024 జులై 1 నుంచి రిటైర్మెంట్‌ అయిన పదివేల మంది అంగన్వాడీ ఉద్యోగుల గురించి లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, కోశాధికారి పి.మంగ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, సీహెచ్‌ రమాకుమారి, యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె. సమ్మక్క, జిల్లా అధ్యక్షులు కె.సరోజన, నాయకులు భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -