– అర్ధాంతరంగా మరణించిన కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి : టిఎస్ యుటిఎఫ్
నవతెలంగాణ-హైదరాబాద్ : రెండు దశాబ్దాలుగా నామమాత్రపు వేతనాలతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్థాంతరంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వద్ద జరిగిన కారు ప్రమాదంలో జిల్లా పరిషత్ హైస్కూలు ప్రధానోపాధ్యాయిని గీతారెడ్డి తోపాటు కెజిబివి స్పెషల్ ఆఫీసర్ కల్పన మరణించారు. వీరి మరణం పట్ల టిఎస్ యుటిఎఫ్ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఇవురు ఒకేరకమైన విధులు నిర్వహిస్తున్నారు. మరణం ఒకటే అయినా కుటుంబాలకు అందే మరణానంతర ప్రయోజనాల్లో మాత్రం తీవ్రమైన వ్యత్యాసం ఉంది. కెజిబివిల్లో పని చేసే ఉద్యోగులు ఎంతకాలం పనిచేసినా వారికి నెలవారీ ఇచ్చే వేతనం మినహా ఏరకమైన ప్రయోజనాలు లేవు. ఆ వేతనం కూడా పనికి సమానమైన వేతనం కాదు. అనారోగ్యానికి గురైనా, అర్థాంతరంగా మరణించినా ఎటువంటి పరిహారం చెల్లించడం లేదు. కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన కల్పన కుటుంబం కడు పేదరికంలో ఉన్నది. పిల్లలు చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని టిఎస్ యుటిఎఫ్ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి సర్వీసులో ఉండగా మరణించిన కెజిబివి ఉద్యోగి కుటుంబానికి కనీసం రూ 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలని, ఉద్యోగానికి భద్రత కల్పించాలని, సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కేజీబీవీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



