నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు ఫిలిం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్య మలుపు తిరిగాయి. జానీ మాస్టర్ సతీమణి సుమలత అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 29 ఓట్ల తేడాతో ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్పై షాకింగ్ విక్టరీ కొట్టారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. యూనియన్లోని గ్రూప్ సపోర్ట్ మొత్తం ప్రత్యర్థి వైపే ఉన్నా, ఎవరి అండదండలు లేకుండా సుమలత ఒంటరిగా బరిలోకి దిగి ఈ విజయం సాధించారు. బలాబలాలన్నీ ప్రత్యర్థి వైపు ఉన్నా, ఆమె సాధించిన ఈ గెలుపు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేసింది.
ఈ గెలుపు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ‘పెద్ది’ చిక్రి లిరికల్ సాంగ్ కంపోజింగ్తో జానీ మాస్టర్ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందగా, ఇప్పుడు ఆయన భార్య అసోసియేషన్ ఎన్నికల్లో రెబల్గా (ఒంటరిగా) గెలుపొందడం వారి క్రేజ్ను తెలియజేస్తోంది. వ్యవస్థాగత మద్దతు కంటే సభ్యుల నమ్మకమే ముఖ్యమని నిరూపిస్తూ, ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆమె సాధించిన ఈ సంచలన విజయం సినీ కార్మిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.



