‘ఎవరి హద్దుల్లో వారుండటం మంచిది…’ అంటుంటారు మన పెద్దలు. ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు, ఉద్యోగుల విషయంలో ఇది నూటికి నూరు శాతం పాటించాల్సిన నియమం. లేకపోతే ప్రొటోకాల్ గొడవలైపోతాయి మరి. ఇటీవల మంత్రి పొంగులేటి విషయంలో ఇదే జరిగింది. ఖమ్మంలో నిర్వహించిన ఓ మీటింగులో ఆయన ”పంచాయతీ’ ఎన్నికల గురించి ప్రస్తావించి, కాంగ్రెస్లో ‘పంచాయితీ’ పెట్టారు. ఆ శాఖమో సీతక్కదాయే. అందుకే ఆమె కినుక వహించారు. ‘స్థానిక ఎన్నికల’ గురించి మేం శాఖాపరంగా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదంటూ ఆ మరుసటి రోజు సీతక్క వివరణిచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆ వెంటనే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం పొంగులేటిపై సీరియస్ అయినట్టు కథనాలొచ్చాయి. మంత్రులతో నిర్వహించిన మీటింగులో ముఖ్య మంత్రి రేవంత్ సైతం…’పంచాయతీ ఎన్నికల పంచాయితీ’గురించి మీకెందుకు సోదరా…అంటూ సున్నితంగా పొంగులేటిని మందలించారు. అసలే ఖజానాలో డబ్బుల్లేక, సంక్షేమ పథకాలు అమల్జేయలేక నానాతంటాలు పడుతుంటే… ఇప్పుడు స్థానిక ఎన్నిలక గురించి ప్రస్తావిస్తే మన పరిస్థితేంగానూ… అన్నట్టు కాంగ్రెస్ శ్రేణులు నివ్వెరపోతున్నాయి. మరోవైపు హస్తం పార్టీ నేతలు, మంత్రులు…’నా పుట్టలో వేలు పెడితే కుట్టకుండా ఉంటనా..’ అన్నట్టు పొంగులేటి మీద గుర్రుగా ఉన్నారు. అందుకే ఎంతస్థాయి నాయకుడైనా వేరే వారి పుట్టలో వేలు పెట్టకుండా ఉంటేనే మంచిదంటున్నాయి గాంధీభవన్ వర్గాలు…
-బి.వి.యన్.పద్మరాజు
పుట్టలో వేలు పెడితే అంతే!
- Advertisement -
- Advertisement -