నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమెకు హర్యానాలోని హిసార్లో గల న్యాయస్థానం మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. జ్యోతి మల్హోత్రా కేసు జూన్ 23వ తేదీన తిరిగి విచారణకు రానుంది. అయితే, ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపడం ఇది రెండోసారి. కాగా, అంతకు ముందు, మే 26వ తేదీన, 4 రోజుల పోలీసు రిమాండ్ తర్వాత ఆమెను 14 రోజుల కస్టడీకి పంపింది.
అయితే, గత వారం పాకిస్తాన్ మద్దతు గల గూఢచర్య నెట్వర్క్తో సంబంధం ఉన్నాడనే ఆరోపణలతో మరో యూట్యూబర్ జస్బీర్ సింగ్ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, జస్బీర్- జ్యోతితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. ఈ సందర్భంగా జస్బీర్ సింగ్ పాకిస్తాన్ నిఘా అధికారి షకీర్ తో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడని చెప్పుకొచ్చారు. యూట్యూబర్ జస్బీర్ సింగ్ సైతం ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పని చేస్తున్నట్లు అనుమానించబడిన భారత సంతతికి చెందిన వ్యక్తి అని విచారణ అధికారి ఒకరు వెల్లడించారు.