- జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి
నవతెలంగాణ-కామారెడ్డి: నిజామాబాద్లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రీజినల్ స్థాయి “జిజ్ఞాస” మోడల్ మేకింగ్ పోటీలలో కామారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మన రాష్ట్రం నుండి మొత్తం 6 ప్రాజెక్టులు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక కాగా, అందులో రెండు ప్రాజెక్టులు కామారెడ్డి జిల్లా నుండి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ కృషి ఉపాధ్యాయుల ప్రతిభా, శ్రమలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, భిక్కనూర్కు చెందిన విద్యార్థులు ఆదర్శ్, విశ్వక్ రాజ్ రూపొందించిన “ది సైన్స్ ఆఫ్ సేఫ్ జర్నీ” ప్రాజెక్టు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కల్వరాల విద్యార్థులు స్నేహ, ప్రసన్న రూపొందించిన “ఫర్టిలైజర్ ఇంజక్టర్” ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయన్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగరంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో పాల్గొనుటకు విద్యార్థులు నేడు కామారెడ్డి నుండి బయలుదేరారు.
ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ, “జాతీయ స్థాయిలో కూడా కామారెడ్డి జిల్లా సత్తా చాటాలని, విద్యార్థులు తమ ప్రతిభతో అందరి ప్రశంసలు పొందాలని” ఆకాంక్షించారు. విద్యార్థులకు మార్గదర్శనం చేసిన గైడ్ టీచర్లు రాజు, శైలజలను అభినందిస్తూ, అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధి మల్లిక ఆధ్వర్యంలో విద్యార్థులు, గైడ్ టీచర్లు పూణేకు బయలుదేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాజు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల ఈ విజయం జిల్లాకు మరింత గౌరవాన్ని తీసుకురావాలని జిల్లా అధికారులు ఆకాంక్షించారు.



