నవతెలంగాణ-హైదరాబాద్: నేడు మద్రాసు హైకోర్టులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పిటిషన్పై విచారణ జరగనుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని సోమవారం టీవీకే పిటిషన్ వేసింది. పథకం ప్రకారం జరిగిన కుట్ర అనే అనుమానాన్ని టీవీకే న్యాయవాద విభాగం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించాలని టీవీకే న్యాయవాదులు విన్నవించారు. ఆ పిటిషన్పై ఈరోజు హైకోర్టులోని మధురై బెంచ్ విచారణ జరపనుంది.
ఇక కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41కి చేరింది. విజయ్ సభ రోజు గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందిన సుగుణ (65) అనే మహిళ సోమవారం మృతి చెందారు. చికిత్స పొందుతున్న వారిలో ఇంకా 11 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అందరూ కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నారు. మొత్తంగా 110 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. సోమవారం 51 మంది డిశ్ఛార్జి అయ్యారు.