నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానం చేయనుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సంజూను సత్కరించనున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, జట్టుకు భారీ స్కోరు అందించడంలో సంజూ కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. కేరళకు గర్వకారణంగా నిలిచిన సంజూ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంజూ విజయం రాష్ట్రంలోని వేలాది మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ సాధారణ తీరప్రాంతంలో పెరిగాడు. స్థానిక మైదానాల్లో క్రికెట్ ఆడుతూ తన కలను సాకారం చేసుకున్నాడు. అక్కడి నుంచి దేశవాళీ క్రికెట్లో రాణించి, భారత జట్టులో దక్షిణాది నుంచి ప్రముఖ ఆటగాడిగా ఎదిగాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా కూడా సంజూ మంచి గుర్తింపు పొందాడు.
రాజధాని నగరంలో జరగనున్న ఈ సన్మాన కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం భారత విజయోత్సవమే కాకుండా తమ రాష్ట్ర ముద్దుబిడ్డకు దక్కే గౌరవంగా కేరళ ప్రజలు భావిస్తున్నారు.



