నవతెలంగాణ-హైదరాబాద్ : సంచలనం సృష్టించిన బెంగళూరు డాక్టర్ కృతికరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త డాక్టర్ మహేందర్ రెడ్డికి మంగళవారం సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. మరోవైపు, దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాల్లో భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరిస్తూ మహేందర్ పంపినట్లుగా ఉన్న మెసేజ్లు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది.
వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే వినియోగించే ప్రొపోఫాల్ అనే అనస్తీషియా మందును అధిక మోతాదులో ఇచ్చి కృతికను మహేందర్ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు అతడు ప్రయత్నించాడు.
విచారణలో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఓ మెసేజ్లో “నేను కృతికను చంపేశాను. త్వరలోనే నా తల్లిదండ్రులతోపాటు ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెబుతాను. నా దగ్గర ఆధారాలు లేవు కానీ, నేను జైలుకు వెళ్తాను. ఒక హంతకుడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు” అని మహేందర్ పేర్కొన్నట్లుగా ఉంది. ఇది కేసులో కీలక ఆధారంగా మారింది. అంతేకాకుండా, తన ప్రేయసికి పంపిన మరో మెసేజ్లో “పోలీసులు మన సంబంధం గురించి అడిగితే కేవలం స్నేహితులమని చెప్పు” అని సూచించడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.
ఫోరెన్సిక్ బృందాలు ఈ కేసులో స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి 10.34 లక్షల డిజిటల్ ఫైళ్లను విశ్లేషించాయి. ఇందులో ఫోన్పే యాప్లోని 485 చాట్ రికార్డులతో పాటు, డిలీట్ చేసిన అనేక మెసేజ్లను కూడా రికవరీ చేశారు.
విక్టోరియా ఆస్పత్రిలో పనిచేసే కృతిక, మహేందర్లకు 2024 మే 26న వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాదిలోపే, 2025 ఏప్రిల్ 23న కృతిక తన తండ్రి ఇంట్లో కుప్పకూలి మరణించింది. అనారోగ్యంతో ఉన్న ఆమెకు చికిత్స పేరుతో మహేందర్ రెండు రోజుల పాటు ఇంజెక్షన్లు ఇచ్చాడు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినా, కృతిక సోదరి ఫిర్యాదుతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ నివేదికలో ఆమె శరీరంలో ప్రొపోఫాల్ ఆనవాళ్లు బయటపడటంతో కేసును హత్య కేసుగా మార్చి ఉడిపి జిల్లా మణిపాల్లో ఉన్న మహేందర్ను అరెస్ట్ చేశారు. నిందితుడి కుటుంబానికి నేర చరిత్ర ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.



