నవతెలంగాణ-హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత కాకరాల సునీత రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. సునీత, రమణ కలిసి ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల అనంతరం జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్దమయ్యారు.విరసంలో కీలక పాత్ర పోషించిన కాకర్ల సత్యనారాయణ కూతురే సునీత. అంతేకాదు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ టీఎల్ఎన్ చలం గౌతమ్ భార్య. చెన్నూరి హరీశ్ అలియాస్ రమణ కూడా ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వరవరరావు, గద్దర్ లాంటి విప్లవకారులు తండ్రి సత్యనారాయణను కలవడానికి ఇంటికి వచ్చేవారు. దాంతో సునీత మావోయిస్టుల సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు. 1986లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన సునీత.. అదే ఏడాది సుధాకర్ను వివాహం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేశారు. 1992లో నల్లమల అడవుల్లోకి వెళ్లిన ఆమె.. 2001లో ఏవోబీ ప్రాంతానికి, 2006లో దండకారణ్యానికి బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు ఐదు ప్రధాన ఎన్కౌంటర్లలో పాలుపంచుకున్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో సునీతది కీలక పాత్ర. మావోయిస్టు పత్రిక జంగ్ క్రాంతికి ఎడిటర్గా పని చేసిన సునీత.. శాంతి చర్చల ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషించారు.