నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమని, ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థ అనే మూడు విభాగాలు కలిసి దాని కింద పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు. తూర్పు మహారాష్ట్రలోని తన స్వస్థలమైన అమరావతిలో బుధవారం నిర్వహించిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిజెఐ ప్రస్తావిస్తూ.. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్కు అధికారాలున్నాయి కానీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేరని అన్నారు. ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక, శాసన మరియు న్యాయవ్యవస్థల్లో ఏ విభాగం అత్యున్నతమైనదో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుందని అన్నారు. చాలా మంది పార్లమెంట్ అత్యున్నతమైనదని చెబుతుంటారని కానీ రాజ్యాంగమే అత్యున్నతమైనదని అన్నారు.
రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను క్లియర్ చేయడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు వెల్లడించిన చారిత్రాత్మక తీర్పుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, బిజెపిలు న్యాయవ్యవస్థపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన జడ్జి స్వతంత్రుడు కాడు. జడ్జి ఎల్లప్పుడు తన విధిని గుర్తుంచుకోవాలి. మనం ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, సూత్రాల సంరక్షకులం. మనకు అధికారం మాత్రమే లేదు.. మనపై బాధ్యతలు కూడా ఉన్నాయి ” అని అన్నారు. ప్రజలు తీర్పుల గురించి ఏమనుకుంటున్నారు అనేది జడ్జీలను ప్రభావితం చేయకూడదని, మనం స్వతంత్రంగా ఆలోచించాలని అన్నారు. ప్రజలు (న్యాయవ్యవస్థ గురించి) చెప్పింది మన నిర్ణయాన్ని ప్రభావితం చేయదని అన్నారు.