నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి)చీఫ్ నేతృత్వంలోని బహుళ విభాగ బృందం దర్యాప్తు చేపడుతోందని గురువారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విమానంలోని బ్లాక్ బాక్స్ నుండి డేటాను సేకరిస్తున్నట్లు పేర్కొంది. అహ్మదాబాద్ దురదృష్టకర ఘటన తర్వాత, ఎఎఐబి వెంటనే దర్యాప్తు ప్రారంభించి, జూన్ 13 న నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా బహుళ విభాగ బృందాన్ని ఏర్పాటు చేసిందని, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏర్పడిన ఈ బృందానికి ఎఎఐబి డిజి నాయకత్వం వహిస్తారని తెలిపింది.
ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఎటిసి అధికారి, బోయింగ్ విమానాల తయారీ, డిజైన్ను రూపొందించిన అమెరికా దర్యాప్తు సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టిఎస్బి) ప్రతినిధులు ఉంటారని విమాన మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. జూన్ 25న (బుధవారం సాయంత్రం) ఎఎఐబి డైరెక్టర్ జనరల్ జివిజి యుగంధర్ నేతృత్వంలోని బృందం ఎఎఐబి మరియు ఎన్టిఎస్బి నుండి సాంకేతిక సభ్యులతో సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముందు బ్లాక్ బాక్స్ నుండి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (సిపిఎం)ను సురక్షితంగా తీశారని, జూన్ 25 మెమరీ మాడ్యూల్ విజయవంతంగా యాక్సెస్ చేయబడిందని, దాని నుండి డేటాను ఎఎఐబి ల్యాబ్లో డౌన్లోడ్ చేసినట్లు తెలిపింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డిఆర్) విశ్లేషణ జరుగుతోందని వెల్లడించింది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతోందని తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలను నివారించేందుకు అవసరమైన అంశాలను గుర్తించడం లక్ష్యమని ఆ ప్రకటన పేర్కొంది.
జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఎ1-171 టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ప్రభుత్వ మెడికల్ హాస్టల్ భవనంపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సహా మెడికల్ కాలేజీ విద్యార్థులు మరణించారు.