– ప్రకటించిన కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం: రాష్ట్రంలోని కొచ్చి తీరంలో ఈ నెల 24న జరిగిన నౌకాప్రమాదాన్ని రాష్ట్ర విపత్తుగా కేరళ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టింకు బిస్వాల్ వెల్లడించారు. ఈ నౌకాప్రమాదం కేరళ తీరానికి పర్యావరణపరంగా, సామాజికంగా, ఆర్థికంగా తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని పేర్కొన్నారు. సముద్ర జలాల్లో చమురు కలవడం, కార్గో కంటైనర్లతో సహా నౌకా శిధిలాలు సముద్రంలో కలవడం వంటి వంటి ఆందోళనకరమైన పర్యావరణ సమస్యలు కూడా ఈ నౌకా ప్రమాదంతో తలెత్తాయని బిస్వాల్ తెలిపారు. కాగా, ఈ నౌకాప్రమాదాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించడం ద్వారా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి వేగవంతమైన సహాయక చర్యల కోసం సిబ్బంది, వనరులను తరలించడానికి, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి ఎక్కువ సంఖ్యలో నగదును సమీకరించడానికి అనుమతిస్తుంది. ఈ నెల 24న కొచ్చికి 14.6 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్కు చెందిన కార్గో షిప్ ఎంఎస్సీ ఇఎల్ఎస్ఎ-3 మునిగిపోయింది. నౌకలోని రష్యా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన 21 మంది సిబ్బందిని భారత నౌకాదళం రక్షించింది. ఇప్పటి వరకూ మునిగిపోయిన నౌకకు చెందిన 54 కంటైనర్లు కొల్లం, తిరువనంతపురం, అలప్పుజ బీచ్లకు కొట్టుకొచ్చాయి. అలాగే తిరువనంతపురం తీరానికి చిన్నచిన్న ప్లాస్టిక్, పాలిథిన్ కణికలు కుప్పలుగా కొట్టుకు రావడంతో దీర్ఘకాలిక సూక్ష్మ ప్లాస్టిక్ కాలుష్యం పెరుగుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర విపత్తుగా కొచ్చి నౌకా ప్రమాదం
- Advertisement -
- Advertisement -