– ముంపు బాధితుల అరణ్య రోదన
– నాగార్జున సాగర్లో భూములు కోల్పోయిన పేదలు
– ఇప్పుడు ఇర్విన్ రిజర్వాయర్తో మళ్లీ రోడ్డుపైకి..
– ఖాళీ చేయాలంటూ నోటీసుల అచ్చిన అధికారులు
– 3 గ్రామాలు, 925 కుటుంబాలు, 1,070 ఎకరాలు నీటి పాలు
– బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీపీఆర్, నోటీసులు అందజేత
– తాజాగా అల్టిమేటం జారీ చేసిన కాంగ్రెస్ సర్కార్
– గీ భూములే ఆధారం..
– మా భూములు లాక్కోవద్దంటున్న బాధితులు
నాగార్జున సాగర్ కడితే.. నలుగురికి మేలు జరుగుతదంటే..65 ఏండ్ల కింద సర్వం కోల్పోయి భూములు త్యాగం చేశారు. కన్న తల్లి లాంటి ఊరుని వదలి మరో ప్రాంతానికి వలస వచ్చారు. అక్కడా రెక్కలు ముక్కలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారి బతుకులు ఓ దారికి వస్తున్నాయి అనుకునే సరికి.. మరో పిడుగు లాంటి వార్త వారి బతుకులను చిన్నాభిన్నం చేయబోతుంది. ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంతంలో కూడా రిజర్వాయర్ కట్టాలని, ఖాళీ చేయాలంటూ ఉన్నపళంగా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు చూసి ప్రజల గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది.ఈ ప్రాజెక్టులు మా ప్రాణాల మీదికి వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
”అప్పుడు నాగార్జున సాగర్.. ఇప్పుడు ఇర్విన్ రిజర్వాయర్.. మేం ఎక్కడకి పోవాలి ‘కృష్ణమ్మ”’ అంటూ ఆ అభాగ్యులు నదీమ తల్లికి మొర పెట్టుకుంటున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇర్విన్ రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న బాధితుల కన్నీటిగాథపై కథనం. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం డీఎల్పీ (డిండి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు)లో భాగంగా ఇర్విన్, అజిలాపూర్, నల్ల చెరువు గ్రామాల పరిధిలో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు 1,070 ఎకరాల్లో 0.5 టీఎమ్సీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం నమూనా డీపీఆర్ సిద్ధం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 250 ఎకరాల ప్రభుత్వ భూమి, 600 ఎకరాల అసైన్డ్ భూమి, 295 ఎకరాల పట్టా భూములు కోల్పోవాల్సి వస్తోంది. ఈ భూములపై సుమారు 938 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఉన్న పళంగా ఈ ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తామంటూ.. ఈ భూములు వదిలివెళ్లాలని గత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా నోటీసులు అందించింది. మరింత తీవ్రతరం చేస్తూ.. అల్టిమేటం జారీ చేయడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
మళ్లీ ఎక్కడికెళ్లాలి..
ఇర్విన్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న బాధితులు.. 65 ఏండ్ల కింద నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన పుట్టంగండి ప్రాంత వాసులు. అక్కడ భూములు కోల్పోయి, ఊరునూ కోల్పోయి.. బతుకుదెరువు కోసం ఇర్విన్కు వచ్చి స్థిరపడ్డారు. ఇప్పుడు మళ్లీ.. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.. ఇక్కడ సాగు నీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది’ అని ప్రభుత్వం నుంచి నోటీసులు రావడంతో వారు గుండెలు బాదుకుంటున్నారు. ‘ప్రభుత్వాలు ఎందుకు మమ్మల్ని ఇట్లా వెంటాడుతున్నాయి. మాపై ఈ కృష్ణమ్మ పగపట్టిందా..? నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వమంటే ఇస్తిమి.. మళ్లీ మా దగ్గరికే రావాలా.. ఇప్పుడూ మేమే ఇవ్వాలా..’ అని ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ గోడు వినిపించుకోవాలని కోరుతున్నారు.
భూగర్భ జలాల పెంపు కోసమే ప్రాజెక్టు ప్లాన్..
ఇర్విన్ రిజర్వాయర్ కింద ఒక ఎకర ఆయకట్టు కూడా సాగు నీరు ఇవ్వడానికి లేదు.. కేవలం భూగర్భ జలాలను పెంపొందించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈ ప్రాంతంలో రెండు పెద్ద చెరువులు ఉన్నాయి. ఒక్కో చెరువు సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. భూగర్భ జాలలను పెంచాలనుకుంటే ఈ చెరువులను నింపితేచాలని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఎక్కడికి పోయేది..
మా అయ్య.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం భూములిచ్చిండు.. ఇప్పుడు మమ్మల్ని కూడా ఇర్విన్ ప్రాజెక్టు పేరుతో ఇక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. మాకంటూ స్థిరమైన ఊరు లేకుండా పోతోంది. ఇప్పుడిప్పుడే ఊరిడిసిన బాధను మర్చిపోతున్నం.. ఈ సమయంలో మళ్లీ ఇక్కడి నుంచి పొమ్మంటున్నరు. ఎక్కడికి పోవాలి? ఇక్కడి నుంచి కదిలేది లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టొద్దు.
– కడారి పర్వతాలు, రైతు
గీ భూములే ఆధారం
రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. మా ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచాలంటే.. రెండు పెద్ద చెరువులు ఉన్నాయి. అందులోకి నీళ్లు తెస్తే చాలు. ఎవరికి ఉపయోగపడని ప్రాజెక్టుతో మా పొట్టగొట్టొద్దు. ఈ భూములను నమ్ముకుని మేము బతుకుతున్నాం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.
– లక్ష్మయ్య, రైతు