ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన చిత్రం ‘కుబేర’. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ‘కుబేర’ సక్సెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి మాట్లాడుతూ,’నాగార్జున ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు. ఈ సినిమా గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. నాకు ఎప్పట్నుంచో డిఫరెంట్గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. దానికి ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పారు. నేను సినిమా చూశాను. ఆయన చెప్పినది 100% కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. దేవ క్యారెక్టర్లో ధనుస్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. ఒక్కొక్క సినిమాని ఆణిముత్యంలాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రష్మిక ఫెంటాస్టిక్గా పెర్ఫార్మ్ చేసింది’ అని అన్నారు. ‘ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్, హ్యూమన్ ఎమోషన్తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమాలో దీపక్, దేవా, సమీరా ఇలా అన్ని పాత్రలే తప్ప స్టార్స్ కనిపించరు. చిరంజీవి వచ్చేటప్పుడు కార్లో చెప్పారు ‘చాలా బాగా చేశావు దీపక్ అయిపోయావు’ అన్నారు. అప్పుడు నాకు శేఖర్ కమ్ముల గొప్పతనం అర్థమైంది’ అని నాగార్జున చెప్పారు. హీరో ధనుష్ మాట్లాడుతూ, ‘ఇది ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు కోసమే ప్రతి ఆర్టిస్ట్ ఎదురుచూస్తారు. ఇలాంటి రోజుల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక సినిమాకి యునానిమస్గా అద్భుతమైన రెస్పాన్స్ రావడం అనేది చాలా అరుదు. అది ఈ సినిమాకి జరిగింది’ అని తెలిపారు.