Sunday, June 1, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కార్మికోద్యమ నేత ఎన్‌వి.భాస్కరరావు

కార్మికోద్యమ నేత ఎన్‌వి.భాస్కరరావు

- Advertisement -

– యూనియన్ల నిర్మాణంలో ప్రత్యేకపంథా
– చిరుప్రాయం నుంచే ఉద్యమబాటలో
– న్యాయవాద వృత్తిని వదిలేసి ఉద్యమ రంగంలోకి
– హైదరాబాద్‌, చుట్టు పక్కల ప్రాంతాల్లో సీఐటీయూ విస్తరణలో ప్రత్యేక కృషి
– ఆయన వేసిన బీజాలతో నేడు పలు పరిశ్రమల్లో గుర్తింపు సంఘంగా సీఐటీయూ
– నేడు ఆయన పేరిట సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జీవితంలోని ఆటుపోట్లు, కష్టనష్టాలు మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. ‘మనుషులంతా సమానమే’ అన్న సమాజ నిర్మాణం కోసం కొట్లాడిన వారు ఎప్పటికీ ఆదర్శనీయులుగా, ఆచరణీయులుగానే ఉంటారు. న్యాయవాదులెందరో ఉంటారు.. ‘ఈ హక్కులు మీ కోసమే..మీ జీవితా లను మెరుగు పర్చేందుకే ట్రేడ్‌ యూనియన్‌ చట్టాలు’ అంటూ చైతన్యపరిచిన వారు ఎప్పటికీ కార్మికుల గుండెల్లో గూడుకట్టుకుంటారు. ఉన్నత చదువులు చదివినా నా జీవితం పేదల కోసమే అని కొట్లాడిన వాళ్లు అమరజీవు లుగా నిలిచిపోతారు. అలాంటి కోవలోకి వచ్చే గొప్ప వ్యక్తే నాదెళ్ల విజయ భాస్కరరావు. అందరూ కార్మి కోద్యమం నుంచి రాజకీయ నేతలుగా ఎదిగితే ఆయన మాత్రం రాజకీయ నేతగా ఎదిగి చివరకు కార్మికుల హక్కుల కొట్లాడిన మహౌన్నత వ్యక్తి. కార్మికోద్యమ నేతగా ఎన్‌విబీగా అందరికీ సుపరిచితులు. ఆకులన్నీ రాలిన చెట్టు కొత్తగా చిగురించిన మాదిరిగానే హైదరాబాద్‌ మహానగరంలో ఏడు మందితో కలిసి సీపీఐ(ఎం) విస్తరణలో కృషి చేసిన మహనీయుడు. ఆయన వేసిన బీజాలతోనే విస్తరించి ఈనాడు అనేక పరిశ్రమల్లో సీఐటీయూ గుర్తింపు సంఘం గెలుస్తున్నదనే విషయాన్ని ఎవ్వరూ కాదన్నలేని సత్యం. అలాంటి మహనీయుని పేరిట నిర్మించిన సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ప్రారంభం కాబోతున్నది. దానికి ముఖ్యఅతిథులు ఆ యూనియన్‌ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కె.హేమలత, తపన్‌సేన్‌, ఉమ్మడి ఏపీ పూర్వ ప్రధాన కార్యదర్శి బీవీ.రాఘవులు, తదితరులు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు.
కుటుంబ ప్రస్థానం ఇలా…
ఎన్‌విబిగా సుపరిచితులు అయిన నాదెండ్ల విజయ భాస్కర్‌రావు 1931 జనవరి తొమ్మిదో తేదీన కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గరల్లోని నాదెళ్లవారి పాలెంలో జన్మించారు. ఆ గ్రామంలో సగం జనాభా కమ్యూనిస్టుల వైపే ఉండేది. చల్లపల్లి జమీందారుకు వ్యతిరేంగా ఉంటూనే తమ హక్కుల కోసం కొట్లాడేవారు. ఆ చైతన్య ప్రభావం ఎన్‌విబిపై స్పష్టంగా ఉంది. పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. తదనంతర కాలంలో తల్లితో కలిసి విజయవాడలోని ప్రజాశక్తినగర్‌కు చేరుకున్నారు. ‘చదువుతూ పోరాడు..చదువుకై పోరాడు’ నినాదాన్ని ఒంటబట్టించుకున్న ఆయన పోరాటాల్లోనే కాదు చదువుల్లోనూ ఎప్పుడూ ముందే ఉండేవాడు. ఆయన తెలివితేటల్ని గుర్తించి టీచర్లు ఇంజినీరింగ్‌ కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలకు ఆటంకం కలుగొద్దనే ఉద్దేశంతో బీకాం(ఆనర్స్‌) చదివారు. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు.
పార్టీ అవసరాల రీత్యా హైదరాబాద్‌కు…
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ అవసరాల రీత్యా ఎన్‌విబిని హైదరాబాద్‌ పార్టీ ఆఫీసుకు పంపింది. కొంత కాలం ఆఫీసు కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత కొంత కాలం పార్టీ శాసనసభ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు ఆయన కుటుంబం మారింది. హైదరాబాద్‌కు వచ్చాక మగ్దుం మొయినొద్దీన్‌, చండ్ర రాజేశ్వర్‌రావు, రాజ్‌బహదూర్‌గౌర్‌, తమ్మారెడ్డి సత్యనారాయణ, బీఎన్‌రెడ్డి, చంద్రం, ఓంకార్‌, కాచం కృష్ణమూర్తి, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, గుంటూరు బాపనయ్య లాంటి నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వివిధ జిల్లాల నుంచి పనుల నిమిత్తం వచ్చే నాయకులకు ఎన్‌విబి క్వార్టర్‌ అడ్డాగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో సీపీఐ(ఎం) వైపు వచ్చారు. పూర్తిగా తన న్యాయవాద వృత్తిని వదిలేసి చివరి శ్వాసవరకు పార్టీ, ట్రేడ్‌యూనియన్‌ బలోపేతం కోసమే పనిచేశారు.
ఉద్యమ నిర్మాణంలో ఎన్‌విబి ప్రత్యేక పంథా
హైదరాబాద్‌ నగరంలో అన్నింటా తానై విద్యార్థి, కార్మిక సంఘాల నిర్మాణంపై ఎన్‌విబి కేంద్రీకరించారు. హైదరాబాద్‌నగరం, దాని చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో సీఐటీయూ అనుబంధ సంఘాల బలోపేతంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా పరిశ్రమల్లో బెంగాల్‌, కేరళ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవ్వరు? కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రాలైన ఆనాటి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి పనిచేస్తున్న కార్మిలెవరు? పార్టీ సానుభూతి పరులెవ్వరు? కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల ఆసక్తి ఉన్నవారెవ్వరు? సీపీఐ(ఎం) నాయకులు, బంధువులకు సంబంధించిన వారెవ్వరు? ఇలా ప్రత్యేకంగా నోట్స్‌ రాసుకుని మరీ వారిని సీఐటీయూ సంఘంలో పనిచేసేలా తన వంతు కృషి చేశారు. ఏ కార్మికుడు ఎవరు చెబితే వింటారు? భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందిచొచ్చు? అని ప్రత్యేక దృష్టి సారించి పనిచేశారు. నేడు చాలా పరిశ్రమల్లో సీఐటీయూ గుర్తింపు సంఘంగా వెలుగొంద డానికి కారణం ఎన్‌విబి వేసిన బీజాలే. హెచ్‌ఎంటీ, ఈసీఐఎల్‌, హెచ్‌ఏఎల్‌, ఐడీపీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, బీహెచ్‌ఈఎల్‌(ఆర్‌అండ్‌డి), అల్విన్‌, ఎన్‌ఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌, హెచ్‌ఎంటీ, గవర్నమెంట్‌ ప్రెస్‌లో యూనియన్ల నిర్మాణానికి కృషి చేశారు. బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ వంటి యూనియన్లను గైడ్‌ చేసేవారు. అతకు ముందుకు ట్రేడ్‌ యూనియన్లు అంటే అధ్యక్షుల ఇండ్లలో మొక్కుబడిగా జనరల్‌ బాడీ మీటింగ్‌లు జరిగేవి. నామినేట్‌ చేసేవారు. ఆ సమయంలో జి.వెంకటస్వామి, సంజీవరెడ్డి, టి.అంజయ్య, శీతల్‌సింగ్‌ లష్కరి వంటి వారే నాయకులు. అలాంటి పరిస్థితి నుంచి ట్రేడ్‌యూనియన్‌ కార్మికుల మధ్యనే ఉండి పనిచేయాలి..కార్మికుల హక్కుల కోసమే గళమెత్తాలి అనే పంథాతో ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమాన్ని ప్రజాతంత్రయుతంగా మార్చారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లోనూ కార్మికుల హక్కుల కోసం కొట్లాడారు. లేబర్‌కోర్టుల్లో కార్మికులపై యాజమాన్యాలు వేసే కేసులు, కార్మికుల సమస్యలపై జరిగే పోరాటాలకు సంబధించిన కేసులకు సంబంధించిన న్యాయసలహాలు ఇవ్వడంలో ముందుండేవారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపు అంచుల వరకెళ్లి…
1978 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఎన్‌విబి పోటీచేశారు. ఆయా కంపెనీల్లోని కార్మికులు, ప్రజా సంఘాల వాళ్లు నెల పాటు సెలవు పెట్టి ఎన్‌విబి గెలుపు కోసం తమ శక్తిమేరకు పనిచేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 1762 ఓట్లతో ఓటమి చెందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాందాసుకు 23155 ఓట్లు దక్కగా భాస్కర్‌రావుకు 21393 ఓట్లు వచ్చాయి. జనతా పార్టీ ద్రోహం ఫలితంగా అతి స్వల్ప తేడాతో ఎన్‌విబిపై కాంగ్రెస్‌(ఐ) నేత రాందాసు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పట్టణ ప్రాంతంలో, ఎలాంటి ప్రలోభాలకు వెళ్లకుండానే ఆ కాలంలోనే ఆయనకు 21వేల పైచిలుకు ఓట్లు రావడం గొప్ప విషయం. ఆ కాలంలో ప్రజాశక్తి పత్రిక ప్రజలకు చేర్చడానికి ఆయన తన గుండె జబ్బును సైతం లెక్కచేయక కృషి చేశారు. ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లోనే ప్రజాశక్తి చందాదారులుండేవారు. తెల్లావారుజామున నాలుగు గంటలకు గౌలిగూడ బస్టాండుకెళ్లి విజయవాడ నుంచి వచ్చిన పార్సెల్స్‌ తీసుకుని తన స్కూటర్‌పై ఆయా ప్రాంతాల్లో కట్టలు వేసి తర్వాత యూసుఫ్‌గూడలోని ఇంటికెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. తర్వాత రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయేవారు. తన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా, పార్టీ అగ్రనేతలు వారించినా పట్టువిడవకుండా టీయూ విస్తరణ కోసం పనిచేశారు. లక్ష్మీదాస్‌, స్వామి, రఘుపాల్‌( సీపీఐ(ఎం) హైదరాబాద్‌ నగర మాజీ కార్యదర్శి.ఇటీవల మరణించారు.) తదితరుల సహకారంతో పార్టీ విస్తరణకు కృషి చేశారు. చివరకు 1984 అక్టోబర్‌ 24న ఎన్‌విబి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
చిరుప్రాయం నుంచీ ఉద్యమబాటనే…
ఓవైపు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూనే ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయులకు డెన్‌కీపర్‌గానూ, కొరియర్‌గానూ పనిచేశారు. ఆ పోరాటంలో పార్టీ ముగ్గురు వ్యక్తులతో ఏర్పాటు చేసిన డెన్‌లో ఎన్‌వి.భాస్కరరావు ఒకరు. మిగతా ఇద్దరు అనంతరెడ్డి(అడ్వకేట్‌), వి.హనుమంతరావు(జర్నలిస్టు). ఆ పోరాట సమయంలో విజయవాడ ప్రజాశక్తి నగర్‌లోని కమ్యూన్‌(సామూహిక వంట శాల, నివాస స్థలం)కు ఎన్‌విబి తల్లి వెంకటనర్సమ్మ బాధ్యులుగా వ్యవహరించారు. ఎన్‌విబి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన సతీమణి సక్కుబాయి గురించీ తెలుసుకోవాల్సిందే. ములకలపల్లికి చెందిన ఆమెను తాను పూర్తికాలం కార్యకర్తననీ, ఆస్తిపాస్తులు లేవు కాబట్టి కుటుంబం కోసం ఆమె ఉద్యోగం చేయాలని చెప్పి ఒప్పుకున్నాకే పెండ్లి చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -