Wednesday, June 18, 2025
E-PAPER
Homeకరీంనగర్భూ వివాదాలు… కత్తిపోట్లు

భూ వివాదాలు… కత్తిపోట్లు

- Advertisement -

సిరిసిల్లలో వరుస కత్తిపోట్ల కలకలం

బాలుడు మృతి

హత్యాయత్నం కేసులో 9 మంది రిమాండ్..

భూ వివాదంలో ఓ కుటుంబం ప్రాణాలమీదకు…

బంధువులతో సహా మరో కుటుంబం కటకటాలపాలు…

నవతెలంగాణ సిరిసిల్ల

రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. భూ వివాదాలు ఉమ్మడి కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. సొంత తండ్రి, సోదరులను హతమార్చే విధంగా ప్రేరేపిస్తున్నాయి. అమాయక ప్రజల ఆశలే ఆసరాగా పంచాయతీ పెద్దలు పూట గడుపుకుంటున్నారు. ఇలాంటి ఓ ఘటనకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికయ్యింది. హత్యాయత్నం కేసులో సిరిసిల్ల పోలీసులు 9 మందిని అరెస్టు చేసే రిమాండ్ కు తరలించారు. భూ వివాదం ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలను చిదిమేసింది. ఈ ఘటనలో ఓ కుటుంబం ప్రాణాల మీదకు రాగా, బంధువులతో సహా మరో కుటుంబం కటకటాల పాలయ్యింది. శాంతినగర్ లోని కొద్ది రోజుల క్రితం భూమి వివాదంలో సొంత బాబాయి తోపాటు సోదరుడిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. నాలుగు రోజుల క్రితం చంద్రంపేటలోని భూ వివాదంలో సొంత బాబాయి కుటుంబం పై ఇద్దరన్నదమ్ములు కత్తులతో దాడి చేశారు.

కత్తిపోట్ల కలకలం
సిరిసిల్లలో వరస కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి ఈ మధ్యకాలంలో పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కలికోట పృథ్వి అనే యువకుడు ఓ భూ వివాదంలో బాబాయి కుటుంబం పై కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో బాబాయి వెంకటేష్ చిన్నమ్మ ఏంజెల్ లకు స్వల్ప గాయాలు కాగా వారి ఏడాది కుమారుడికి తీవ్ర గాయాలు కాగా ఆ బాలుడు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ప్రజలు మరువక ముందే సిరిసిల్లలో  మరోసారి కత్తిపోట్లు కలకలం రేపాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు చంద్రంపేటకు చెందిన కోలకాని నర్సయ్య, అంజయ్య ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఇటీవల నర్సయ్య కొడుకు నాగరాజుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా వివాదంలో ఉన్న భూమిలో ఇల్లు కట్టుకుందామని చదును చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అంజయ్య అతని కొడుకు పర్షరాములు ఆ భూమిలో తమకు వాటా ఉందని గొడవకు దిగారు. ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి కత్తిపోట్లకు దారి తీసింది.

పథకం ప్రకారమే హత్యాయత్నం

తన బాబాయి అంజయ్యతో వివాదంలో ఉన్న భూమి తమకు చెందాలంటే తమ బాబాయి కుటుంబాన్ని హతమార్చాలని నాగరాజు అతని సోదరుడు శ్రీనివాస్ ముందుగానే పథకం వేసుకున్నారు. హత్య చేయడం కోసం ముందుగానే కత్తులు తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. శనివారం భూమి దగ్గర జరిగిన గొడవ పెద్దది చేసి నాగరాజు అతని సోదరుడు శ్రీనివాస్ తమ కుటుంబంతో సహా అంజయ్య అతని కుమారుడు పర్షరాములుపై దాడికి దిగారు. ముందుగానే పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తులతో నాగరాజు మామ వేములవాడ రూరల్ మండలం మారుపాక కు చెందిన వేముల భూమయ్య అతని కుమారులు నాగరాజు, ప్రశాంత్, బామ్మర్ది మల్లేశం సహకారంతో కత్తులతో దాడికి చెయ్యగా, అంజయ్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయన కుమారుడు పర్షరాములుకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పర్షరాములు పరిస్థితి విషమంగానే ఉంది.

9 మంది అరెస్ట్, రిమాండ్

ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ వెల్లడించారు. ఈ కేసులో కోలకాని శ్రీనివాస్, నాగరాజు ఇరువురి భార్యలు మమత, మంగవ్వ, తల్లి ఎల్లవ్వ, మామ వేముల భూమయ్య, బావమరుదులు నాగరాజు, ప్రశాంత్, భూమయ్య బావమరిది మల్లేశంలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఆయన తెలిపారు.

ఫలించని పంచాయతీలు

గత కొన్ని ఏళ్లుగా కొలకాని నర్సయ్య, అంజయ్య ఇరువురు అన్నదమ్ముల మధ్య వారసత్వంగా వచ్చిన భూముల విషయంలో గొడవ జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నర్సయ్య మరణించగా అప్పటి నుండి ఆయన కుమారులు, సోదరుడు అంజయ్య కుటుంబం మధ్య భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ ఇండ్ల వద్ద ఉన్న 13 గుంటల భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అదే వార్డుకు చెందిన కొంతమంది పెద్దమనుషులను ఇరు కుటుంబాలు ఆశ్రయించగా ఆ పెద్దమనుషులు పంచాయతీలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో నాగరాజు సిరిసిల్ల పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలిసింది. పెద్ద మనుషుల సమక్షంలో భూవివాదం పరిష్కరించుకోవాలని ఇరు కుటుంబాలకు పోలీసులు సూచించగా, పెద్దమనసులు పంచాయతీని వాయిదా వేస్తూ వచ్చినట్లు సమాచారం. పెద్దమనుషుల నిర్లక్ష్యం వల్లనే ఇరు కుటుంబాల మధ్య ఈ దారుణం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -