నవతెలంగాణ-హైదరాబాద్: కాసులకు కక్కుర్తి పడి తినే పదార్ధాలను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమడుతున్నారు కొందరు కేటుగాళ్లు. హైదరాబాద్లో రోజుకో కల్తీ ముఠా వ్యవహారం వెలుగులోకి వస్తోంది. మొన్న కల్తీ నెయి, నిన్న అల్లం పేస్ట్, తాజాగా గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీ గుట్టు రట్టు చేశారు SOT పోలీసులు. శేరిలింగంపల్లి SOT టీమ్ గచ్చిబౌలి పరిధిలోని వట్టి నాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాత్ ట్రేడర్స్ అనే దుకాణంపై దాడి నిర్వహించారు.
దాడిలో రాజస్థాన్కు చెందిన దుకాణ యజమాని గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి, వాటిని సోయాబీన్ నూనెతో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా ఆయిల్ వంటి పేర్లతో మళ్లీ ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో పోలీసులు మొత్తం 5,026 లీటర్ల కల్తీ వంట నూనె (సుమారు రూ.10,55,460 విలువ) , 5,192 కిలోల గోధుమ పిండి (సుమారు రూ.3,11,520 విలువ) స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా ఒక వెయింగ్ మెషిన్, ఒక ఆయిల్ ఫిల్టర్ మెషిన్, ఒక గోధుమ ఫిల్టర్ మెషిన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు , TS07UL2884 నంబర్ టెంపో ట్రాలీ ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



