ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ ‘పెపె’ ముజికా 89వ ఏట 2025 మే 13న మరణించారు. అతడి జీవిత సహచరి, ఉద్యమ సహచరి లూసియా టొపోలన్స్కీ గతంలో గెరిల్లా యోధురాలు, సెనేటర్ కూడా. ఒక గెరిల్లా యోధుడి నుండి దేశాధ్యక్షుడి దాకా కొనసాగిన ముజికా జీవనయానం చాలా ప్రత్యేకమైనది. ఏండ్ల తరబడి ఒంటరిగా ఖైదు జీవితాన్ని అనుభవిం చాడు. ఆ తర్వాత ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు. ఉరుగ్వేలోని మాంటెవిడియో లో ముజికా 1935 మే 20న జన్మించాడు. వాళ్లది ఒక మధ్యతరగతి కుటుంబం. ఎనిమిదేళ్ళ్లకే తండ్రిని పోగొట్టుకున్నాడు ముజికా. దాంతో తన పొట్ట పోసుకోడానికి అన్ని రకాల పనులనూ చేయాల్సి వచ్చింది. రొట్టెలు ఇళ్ళకు సరఫరా చేయడం నుంచి పువ్వులు అమ్మడం వరకూ రకరకాల పనులు చేశాడు. యుక్తవయస్సు వచ్చాక కొద్దికాలం పాటు మధ్యేవాద-మితవాద పార్టీ అయిన నేషనల్ పార్టీలో పని చేశాడు. ఆ పార్టీ రాజకీయాల పట్ల విముఖత ఏర్పడి ప్రత్యామ్నాయ రాజకీయాల అన్వేషణలో పడ్డాడు. 1959లో జరిగిన క్యూబన్ విప్లవం ముజికాను ఎంతో ఉత్తేజితుడిని చేసింది. 1962లో తన 27వయేటా ఇతరులతో కలిసి ముజికా నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ (ఎం.ఎల్.ఎన్-టి) అనే సంస్థను స్థాపించాడు. అది ఒక గెరిల్లా ఉద్యమం. ఉరుగ్వేలోని నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయడమే దాని లక్ష్యం. తన విప్లవ జీవిత కాలంలో ముజికా నాలుగుసార్లు పట్టుబడ్డాడు. ఆరుసార్లు తూటాలు శరీరంలోంచి దూసుకు పోయినా బతికాడు. జైలు నుండి రెండు సార్లు తప్పించు కున్నాడు. దీర్ఘకాలం క్రూరమైన నిర్బంధాన్ని తట్టుకున్నాడు. ఉరుగ్వేలోని సైనిక నియంతృత్వ పాలనలో అతడిని దారుణంగా చిత్రహింసలు పెట్టారు. తన పద్నాలుగేండ్ల జైలు జీవితంలో పదేండ్ల పాటు ఒక లోతైన నూతిలో ఒక్కడే నిర్బంధించబడ్డాడు. 1985లో సైనిక పాలన అంతం కావడంతో గెరిల్లా యోధులం దరికీ క్షమాభిక్ష లభించింది. దాంతో ముజికా బయటపడ్డాడు.
సెనేట్ నుంచి అధ్యక్ష స్థానం దాకా
విడుదల అనంతరం ముజికా సాయుధ పోరాట మార్గాన్ని విడనాడాడు. ప్రజాతంత్ర రాజకీయాలవైపు మొగ్గు చూపాడు. మూవ్మెంట్ ఆఫ్ పాపులర్ పార్టిసిపేషన్ (ఎం.పి.పి) అనే పార్టీని ఇతరులతో కలిసి స్థాపించాడు. అది ఒక విశాల ప్రాతిపదికన ఏర్పడ్డ వామపక్ష సంఘటన. 1994లో ముజికా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (ప్రజాప్రతినిధుల సభ)కు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత సెనేట్కు ఎన్నుకోబడ్డాడు. పార్లమెంటులో అతడు ఒక సూత్రబద్ధమైన నాయకుడిగా నిజాయితీగా, నిరాడంబరంగా జీవించే నేతగా గౌరవాన్ని పొందాడు. 2009లో ముజికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తనకు కేటాయించిన అధ్యక్ష భవనంలో ఉండడానికి తిరస్కరించి దేశ రాజధాని మాంటెవిడియో శివార్లలో తనకున్న చిన్న రేకుల షెడ్డు ఇంటిలోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. అధ్యక్షుడిగా తనకు వచ్చే జీతంలో తొంభైశాతం వరకూ దానంగా ఇచ్చేవాడు. ”రాజకీయ వేత్తలు తమ ప్రజల మాదిరిగా జీవించాలే తప్ప ప్రత్యేక స్థాయి గల కొద్ది మందిలా ఉండకూడదు” అని చెప్పేవాడు. 2010-15 మధ్య అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఉరుగ్వేను మార్చడానికి ముజికా ఎన్నో చర్యలు చేపట్టాడు. క్రమం తప్పకుండా వేతనాలను పెంచాడు. పేదరికంలో ఉన్న జనాభా సగానికి పైగా దాన్నుంచి బయటపడ్డారు. పేదరికపు రేటు ఏడు శాతానికి తగ్గింది. నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. జీడీపీ సుమారు 5.4 శాతం పెరిగింది. అబార్షన్ను చట్టబద్ధం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్ను ఆమోదించి చట్టం చేశాడు. మరిజువానాపై ప్రభుత్వ నియంత్రణ అమలు చేసి మాదక ద్రవ్య వ్యాపారులకు కళ్లెం వేశాడు. నయా ఉదారవాదం చెప్పే నియమాలకు కట్టుబడకుండా ముజికా తన విధానాలను అమలు చేశాడు. నయా ఉదారవాదానికి, అది పెంచి పోషించే వినిమయతత్వానికి ముజికా బద్ధ వ్యతిరేకి. ”ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలనుకున్న వారే నిజమైన పేదవాళ్లు” అని ముజికా ప్రకటించాడు. పర్యావరణ పరిరక్షణకు, పర్యావరణ హిత అభివృద్ధికి ముజికా కట్టుబడి వ్యవహరించాడు. నేడు ఉరుగ్వే ప్రపంచంలోనే పర్యావరణానికి అత్యంత అంకితభావంతో కట్టుబడిన దేశంగా ఉంది. ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 98 శాతం బయోమాస్ నుండి, గాలి నుండి, సూర్యుడి నుండి వస్తుంది.
ఉరుగ్వే చట్టాల ప్రకారం ఒకసారి అధ్యక్షుడైనవాడు వరుసగా రెండు సార్లు ఆ పదవిలో ఉండకూడదు. ఆ నిబంధనను అనుసరించి ముజికా పదవి నుండి వైదొలగాడు. ఐతే, ఆ సమయానికి 60 శాతం ప్రజానీకం ముజికా విధానాలకు ఆమోద ముద్ర వేశారు. ముజికా 2020 వరకూ సెనేటర్గా కొనసాగాడు. జీవితాంతమూ అతడు లాటిన్ అమెరికా ఐక్యతనే కోరుకున్నాడు. లాటిన్ అమెరికా ఖండంలోని తక్కిన వామపక్ష, అభ్యుదయ వాదులందరికీ ముజికా స్ఫూర్తినిచ్చాడు. 2024లో ముజికాకు అన్నవాహిక వద్ద క్యాన్సర్ సోకినట్టు నిర్ధారించారు. తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ముజికా 2024 ఎన్నికల్లో తమ అభ్యర్ధి యమాందు ఒర్సి గెలుపు కోసం ప్రచారం చేశాడు. జనవరి 2025లో ముజికా ఇక తనకు వైద్యం వద్దని తిరస్కరించాడు. ”ఒక సైనికుడు ఎప్పుడో ఒకప్పుడు విశ్రాంతి తీసుకోవాలి” అన్నాడు. ముజికా మరణం లాటిన్ అమెరికా లోను, ప్రపంచ ప్రజల్లోను విషాదాన్ని నింపింది. పేదలకు, శ్రామిక వర్గానికి అనుకూలంగా ఉండే రాజకీయాల సమున్నత వారసత్వాన్ని ముజికా మనకి వదలి వెళ్ళాడు. అతడి నిరాడంబరత, ప్రజలతో మమేకం కావడం, అవినీతికి అతీతంగా ఉండడం, న్యాయానికి అచంచలంగా కట్టుబడి వ్యవహరించడం ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్బామ్ ”ముజికా లాటిన్ అమెరికాకు, యావత్ ప్రపంచానికి కూడా ఒక గొప్ప ఉదాహరణ” అన్నారు. చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ ”ఇప్పటికన్నా ఇంకా మెరుగుగా చేయవచ్చునన్న తీరని దాహాన్ని మాకు మీరు మిగిల్చి వెళ్లారు. గుండె కొట్టుకుంటున్నంత వరకూ, ప్రపంచంలో అన్యాయం ఉన్నంత వరకూ పోరాటం చేయడం కన్నా గొప్ప పని ఇంకొకటి లేదని మీరు చాటి చెప్పారు” అన్నారు.
నేటి లాటిన్ అమెరికా పరిస్థితి
లాటిన్ అమెరికా నేడు అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. ”ఇప్పటికి చేసినదానికన్నా ఇంకా మెరుగ్గా చేయవచ్చు”నని ముజికా చెప్పినదాన్ని ఆచరించడం పెద్ద సవాలుగా మారింది. గేబ్రియల్ బోరిక్ ప్రభుత్వం చిలీలో చాలా ఎక్కువ అంచనాలతో గెలుపొందింది. కాని ఇప్పుడా ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. ప్రజా తీర్పుకు అనుగుణంగా బోరిక్ వ్యవహరించడం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. రాజ్యాంగ సభ ఒక అభ్యుదయకర రాజ్యాంగాన్ని తయారుచేసింది. కాని దానిని జాతీయ రెఫరెండంలో ప్రజలు తిరస్కరించారు. రెండవ మారు తయారెచితున్న ముసాయిదా రాజ్యాంగం పట్ల ప్రజలకు ఏమంత విశ్వాసం కలగడం లేదు.బొలీవియా లోని మూవ్మెంట్ ఫర్ సోషలిజం (ఎం.ఎఫ్.ఎస్) లో చీలికలు ఏర్పడ్డాయి. మాజీ దేశాధ్యక్షుడు ఇవో మొరేల్స్ను ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఆర్సె పక్కనబెట్టాడు. ఆగస్టులో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎం.ఎఫ్.ఎస్ తన అభ్యర్ధిగా ఎడ్వర్డొ దెల్ కాస్టిలోను నిలబెట్టింది. మొరేల్స్ దీనిని సవాలు చేస్తూ నామినేషన్ వేయడానికి తయారౌతున్నాడు, కాని రాజ్యాంగం రెండు సార్లు కన్నా ఎక్కువగా అధ్యక్ష పదవిని చేపట్టకూడదని నిబంధన విధించింది. ఐనా మొరేల్స్ దీన్ని కూడా ధిక్కరిస్తూ స్థానిక ఆదివాసీలను పెద్దఎత్తున సమీకరించి దేశ రాజధానిలో ప్రదర్శన నిర్వహించాడు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. బాష్ప వాయువు సైతం ప్రయోగించారు. బొలీవియాలోని వామపక్ష శక్తులు ఇలా చీలిపోవడం తీవ్ర నష్టానికి దారి తీయవచ్చు.
ఈక్వెడార్లో ఏప్రిల్ 14న జరిగిన ఎన్నికలలో సిటిజెన్ రివల్యూషన్ అభ్యర్ధి లూయిసా గొంజాలెజ్ గెలుపు ఖాయమని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆమెదే గెలుపు అని ప్రకటించాయి. కాని అధికార వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసి మితవాద అభ్యర్ధి డేనియల్ నోబోవా గెలిచినట్టు ప్రకటించారు. అక్కడ వామపక్ష శక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. బ్రెజిల్లో మితవాద శక్తులు పుంజుకుంటున్నాయి. పచ్చి మితవాది అయిన జైర్ బోల్సనారో ఇప్పటికే ఒకసారి అధ్యక్ష పదవిని నిర్వహించాడు. అక్కడి రాజకీయ పరిస్థితుల్ని బలంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జెంటినాలో మరో మితవాది అయిన జేవియర్ మిలేయీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోంది. ముజికా కాలంలో లాటిన్ అమెరికాలో పలు దేశాల్లో వామపక్ష శక్తుల నాయకత్వంలో ప్రభుత్వాలు నడిచేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే, అంతా అయిపోయిందనుకోడానికి లేదు. కొలంబియా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక వామపక్ష అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. మెక్సికోలో, హౌండురస్లో కూడా వామపక్షవాదులే దేశాధ్యక్షులుగా ఉన్నారు. వీరుగాక వెనిజులాలో మదురో మళ్లీ ఘన విజయం సాధించాడు. తక్కిన దేశాల్లో సిసలైన వామపక్ష శక్తులు పట్టుదలగా ప్రజల్ని సమీకరించి పోరాడుతున్నాయి. అర్జెంటినాలోని శ్రామికవర్గం సాగిస్తున్న పోరాటం ప్రశంసనీయం.
ఈ మొత్తం అల్లకల్లోల పరిస్థితిలో కూడా క్యూబా ఒక ఆశాకిరణంలా నిలిచివుంది. ఎన్ని తీవ్ర సవాళ్లు ఉన్నా, ట్రంప్ ప్రభుత్వం పగబట్టినట్టు వ్యవహరిస్తున్నా, విద్యుత్తు, ఇంధనం, ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసరాల సరఫరా సైతం చాలా చిక్కుల్లోపడ్డా, క్యూబా మాత్రం సోషలిజానికే కట్టుబడి వ్యవహరిస్తోంది. క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ, క్యూబన్ ప్రభుత్వం ప్రజల్ని అంటిపెట్టుకునే వుంటూ సమిష్టిగా ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. ఇన్ని కష్టాల నడుమ కూడా క్యూబా తన అంతర్జాతీయతను ప్రదర్శిస్తూ తన వైద్య సేవలను ఇతర దేశాలకు అందిస్తోంది.క్యూబాకు, పోరాడుతున్న లాటిన్ అమెరికా వామపక్ష శక్తులకు విజయం చేకూరాలని ఆశిస్తూ మన సంఘీభావాన్ని తెలుపుదాం.
– ఆర్.అరుణ్కుమార్
లాటిన్ అమెరికా యోధుడు జోస్ ముజికా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES